Sunday, 5 November 2017

Telugu Murli 01/11/2017

01-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - శ్రీమతాన్ని అనుసరించి స్వచ్ఛంగా, శుద్ధంగా అయ్యి ధారణ చేసి మళ్లీ యుక్తి-యుక్తంగా సేవ చేయాలి. అహంకారములోకి రాకూడదు. శుద్ధ అహంకారములో ఉండాలి''
ప్రశ్న:- ఏ ఒక్క మాట కారణంగా బాబా ఇంత గొప్ప విస్తారమైన జ్ఞానాన్ని ఇవ్వవలసి వస్తుంది?
ఉత్తరం:- గీతా రచయిత నిరాకార పరమపిత పరమాత్మ అని ఋజువు చేసేందుకు తండ్రి మీకు ఇంత గొప్ప విస్తారమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు ఇదే. గీతలో పతితపావనులైన తండ్రి స్థానములో శ్రీ కృష్ణుని పేరు వేసేశారు. ఈ విషయాన్నే నిరూపించాలి. దీని కొరకు అనేక విధాలైన యుక్తులను రచించాలి. తండ్రి మహిమ, శ్రీ కృష్ణుని మహిమ వేరు వేరుగా తెలియజేయాలి.

పాట:- మరణించినా నీ ఒడి (దారి)లోనే, జీవించినా నీ ఒడిలోనే,..........(మర్‌నా తేరీ గలీమె, జీనా తేరీ గలీమే,.......)  
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. బాబా ''మేము జీవించి ఉండే మరణించేందుకు మీ గడప వద్దకు వచ్చాము'' అని అంటారు. ఎవరి ద్వారము(గడప) వద్దకు? గీతా భగవానుడు కృష్ణుడైతే ఈ విషయాలన్నీ జరగవని మళ్లీ అదే మాట చెప్పవలసి వస్తుంది. శ్రీ కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. గీతను వినిపించింది పరమపిత పరమాత్మ. ఈ విషయము పైనే మొత్తమంతా ఆధారపడి ఉంది. ఈ ఒక్క విషయాన్ని అర్థము చేసుకుంటే భారతదేశములో ఉన్న శాస్త్రాలన్నీ అసత్యమైనవని ఋజువైపోతుంది. ఇవన్నీ భక్తిమార్గానికి చెందిన శాస్త్రాలు. ఈ శాస్త్రాలలో కర్మకాండ, తీర్థ యాత్రలు, జపము, తపము మొదలైన వాటిని గురించిన కథలు వ్రాయబడి ఉన్నాయి. భక్తి మార్గములో మీరు ఎంతో శ్రమ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆ శ్రమ అవసరమే లేదు. ఇది ఒక్క సెకండు విషయమే. ఈ ఒక్క విషయాన్ని ఋజువు చేసేందుకు కూడా తండ్రి ఎంత జ్ఞానమివ్వవలసి ఉంటుంది! భగవంతుడిచ్చిన ప్రాచీన జ్ఞానమే జ్ఞానము. మొత్తమంతా గీత పైనే ఆధారపడి ఉంది. స్వయం పరమపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. ఆ జ్ఞానమిప్పుడు ప్రాయ: లోపమైపోయింది. కృష్ణుడు మళ్లీ వచ్చి గీతను వినిపిస్తారని మనుష్యులు భావిస్తారు. కాని ఇప్పుడు మీరు జ్ఞానసాగరులైన పరమపిత పరమాత్మ వచ్చి వినిపించారని మీరు మంచి రీతిగా ఋజువు చేయాలి. కృష్ణుని మహిమ, పరమపిత పరమాత్ముని మహిమ వేరు వేరుగా ఉన్నాయి. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడు సహజ రాజయోగము ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందాడు. చదువుకునేటప్బుడు నామ-రూపాలు వేరే, రాజ్య భాగ్యము పొందినప్పుడు నామ-రూపాలు వేరే. మొదట పతితముగా ఉండి తర్వాత పావనంగా అయ్యాడని ఋజువు చేసి తెలిపించాలి. కృష్ణుని పతితపావనుడని ఎప్పుడూ అనరు. పతితపావనుడు తండ్రి ఒక్కరు మాత్రమే. ఇప్పుడు ఆ కృష్ణుని ఆత్మనే ఏదైతే నల్లగా అనగా శ్యామముగా అయ్యిందో, అదే ఆత్మ మళ్లీ ఇప్పుడు పతితపావనుని ద్వారా రాజయోగము నేర్చుకుని భవిష్య పావన ప్రపంచానికి రాకుమారునిగా తయారవుతూ ఉంది. ఇది ఋజువు చేసి అర్థము చేయించేందుకు యుక్తులు కావాలి. విదేశస్థులకు ఋజువు చేసి తెలిపించాలి. సర్వ శాస్త్రాల శిరోమణి శ్రీమత్‌భగవద్గీతా మాతయే నంబర్‌ వన్‌. అయితే ఈ గీతా మాతకు జన్మనిచ్చిందెవరు? ఆ తండ్రే స్వయంగా వచ్చి మాతను దత్తత చేసుకుంటారు. అలాగని ఏసుక్రీస్తు బైబిల్‌ను దత్తత చేసుకున్నాడని కాదు. ఏసుక్రీస్తు ఇచ్చిన శిక్షణలను బైబిల్‌గా తయారు చేసి చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు గీతలోని శిక్షణలను ఎవరిచ్చారు? అవన్నీ పుస్తకంగా తయారు చేసుకొని చదువుతూ ఉన్నారు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. మిగిలిన అన్ని శాస్త్రాలను గురించి వివరంగా తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణ ఎవరిచ్చారో నిరూపించాలి. ప్రపంచము రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ పోతోంది. ఈ ఆలోచనలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చుంటాయి. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించరో, వారికి ధారణ కూడా జరగదు. మీరు బొత్తిగా అర్థము చేయించలేరని శ్రీమతము చెప్తుంది. ముఖ్యమైన విషయము గీతా భగవానుడు పరమపిత పరమాత్మ అని బాబా వెంటనే చెప్తున్నారు. పతిత పావనులు కూడా వారే. మనుష్యులేమో సర్వవ్యాపి అని అంటారు లేక బ్రహ్మతత్వమని అంటారు. నోటికి ఏది వస్తే అది అర్థము చేసుకోకుండా అనేస్తారు. మొత్తము తప్పంతా గీత నుండే మొదలయ్యింది. ఎందుకంటే గీతా రచయిత కృష్ణుడని అనేశారు.అందువలన అర్థము చేయించేందుకు యుక్తులు రచించవలసి వచ్చింది. బెనారస్‌లో గీతా భగవానుడు శ్రీ కృష్ణుడు కాదని ఋజువు చేసి చెప్పమని గుప్తా గారికి కూడా చెప్పేవారు.

ఇప్పుడు ఢిల్లీలో సమ్మేళనము జరుగుతుంది. అన్ని మతాలకు చెందిన గొప్పవారిని పిలుస్తున్నారు. పిలిపించి శాంతి నెలకొల్పేందుకు ఏ ఉపాయము చేయాలి...... అని ఆలోచిస్తారు. ఇప్పుడు శాంతిని స్థాపన చేయడం వారి చేతిలో లేనే లేదు. ఓ పతితపావనా! రమ్మని పిలుస్తారు. కావున ఈ పతితులు శాంతిని ఎలా స్థాపన చేయగలరు? ఒకవైపు పిలుస్తూనే ఉంటారు. కాని పతితపావనుడు ఎవరో వారికి తెలియదు. రఘుపతి రాఘవ రాజారామ అని అంటారు. కాని అతడు పతితపావనుడే కాదు. తెలియకుండా అసత్యపు పిలుపు పిలుస్తూ ఉంటారు. అయితే అచ్చటికి వెళ్ళి ఇది ఎవరు తెలపాలి? చాలా మంచి పిల్లలుగా ఉండాలి. తమను తాము గొప్ప జ్ఞానులమని భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొద్దిగా కూడా జ్ఞానము లేదు. ఉదాహరణానికి ఎలుకకు ఒక చిన్న పసుపుకొమ్ము లభిస్తే, తానే గొప్ప అని భావించినట్లు జ్ఞానమంతా మాకే తెలుసు అని అనుకుంటారు. అందరూ నెంబర్‌వారుగా ఉంటారు. ఇందులో చాలా మంచి యుక్తులు కావాలి. ఆ యుక్తుల ద్వారా గీతా రచయిత భగవంతుడని ఋజువు అవ్వాలి. ఎవరైతేనేమి అందరూ భగవంతులే కదా అని వారంటారు. భగవానువాచ - 84 జన్మలు పూర్తి చేసి, అంతిమ జన్మలో ఉన్న కృష్ణుని ఆత్మను దత్తత తీసుకుని, బ్రహ్మగా చేసి అతని ద్వారా గీతా జ్ఞానమును ఇస్తున్నాను. ఆ బ్రహ్మనే మళ్లీ ఈ సహజ రాజయోగము ద్వారా సత్యయుగములో మొదటి రాకుమారునిగా అవుతాడు. ఆ జ్ఞానపూరిత వివరణ ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీలో కూడా ఆ శుద్ధ అహంకారము యదార్థ రీతిలో ఇంకనూ రాలేదు. అనేక ప్రదర్శనీలు మొదలైనవి ఎన్నో చేస్తున్నారు. కాని ఇంతవరకు నిరూపించలేదు. మొదట ఈ తప్పును నిరూపించి తెలపాలి. సర్వ శాస్త్రాల తల్లి-తండ్రి శ్రీమత్‌ భగవద్గీత అని నిరూపించాలి. దాని రచయిత ఎవరు? ఉదాహరణానికి ఏసుక్రీస్తు బైబిల్‌కు జన్మనిచ్చారు. అది క్రైస్తవ ధర్మశాస్త్రము. అయితే బైబిల్‌కు తండ్రి ఎవరు? ఏసుక్రీస్తు. కాని ఏసుక్రీస్తును తల్లితండ్రి అని ఎవ్వరూ అనరు. అచ్చట మదర్‌ (తల్లి) మాటే లేదు. ఇచ్చట మాత్రమే మాతా-పితల విషయం ఉంది. క్రిస్టియన్లు కృష్ణుని ధర్మమంటే ఈర్ష్య చెందారు. వారు ఏసుక్రీస్తును గౌరవిస్తారు(నమ్ముతారు). అయితే గీతను వినిపించిందెవరు? గీత ద్వారా ఏ ధర్మ స్థాపన జరిగింది? ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడైన పరమపిత పరమాత్మ యజ్ఞాన్ని రచించారని ఎప్పుడూ అనరు. సృష్టిచక్ర చిత్రము ద్వారా ఈ జ్ఞానాన్ని పరమపిత పరమాత్మ ఇచ్చారని అర్థము చేసుకోగలరు. రాధా-కృష్ణులైతే సత్యయుగములో కూర్చొని ఉన్నారు. వారంతకు వారే జ్ఞానమిచ్చుకోలేరు. జ్ఞానమిచ్చేవారు మరొకరుండాలి కదా. ఎవరో ఒకరు వారిని పాస్‌ చేయించి ఉంటారు కదా. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? అదృష్టము దానంతదే తయారవ్వదు. అదృష్టాన్ని తయారుచేయు వారు తండ్రి లేక టీచరుగా ఉంటారు. గురువైతే గతినిస్తారు. కాని గతి-సద్గతుల గురించి కూడా అర్థము ఎవ్వరికీ తెలియదు. సద్గతి ప్రవృత్తిమార్గము వారికి చెందింది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వస్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ అర్థము కావు. వారైతే భక్తిమార్గపు పెద్ద పెద్ద దుకాణాలు తెరచి కూర్చున్నారు. కాని సత్యమైన జ్ఞాన దుకాణము ఒక్కటి కూడా లేదు. అవన్నీ భక్తిమార్గపు దుకాణాలు. తండ్రి అంటున్నారు - ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. ఈ జప-తపాదులతో నేను లభించను. నేను పిల్లలకు జ్ఞానమిచ్చి పావనంగా తయారు చేస్తాను. మొత్తము సృష్టికి సద్గతినిస్తాను, వయా గతిలోకి వెళ్ళి సద్గతిలోకి రావాలి. అందరూ సత్యయుగములోకి రాలేరు. ఇది తయారైన డ్రామా. కల్పక్రితము మీకు నేను ఏమి నేర్పించానో, ఏ చిత్రాలు తయారు చేయించానో ఆ చిత్రాలే ఇప్పుడు కూడా తయారు చేయిస్తున్నాను. ఈ పెద్ద తప్పు ఏదైతే ఉందో, అది ఋజువు అయ్యేందుకు మళ్లీ యుక్తితో చిత్రాలు తయారుచేస్తారు. మూడు ధర్మాల కాళ్ళ పై సృష్టి నిలబడి ఉందని అంటారు. దేవతా ధర్మమనే కాలు విరిగిపోయి ఉంది. అందుకే కదులుతూ ఉంటుంది. మొదట ఒకే కాలి పై ఈ మొత్తము సృష్టి ఫస్ట్‌క్లాస్‌గా నిలబడి ఉంటుంది. ఒకే ధర్మముండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. తర్వాత మళ్లీ ఆ ఒక్క కాలు అదృశ్యమై మూడు కాళ్ళు వచ్చాయి. వాటిలో శక్తి కొంచెము కూడా ఉండదు. పరస్పరము కొట్లాటలు, పెనుగులాటలు నడుస్తూ ఉంటాయి. దిక్కు ఎవరో, ఆధారము ఎవరో తెలియనే తెలియదు. దిక్కులేని వారుగా, అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తులు కావాలి. ప్రదర్శినీలో కూడా ముఖ్యంగా గీతా భగవానుడు కృష్ణుడు కాదని, పరమపిత పరమాత్మ అని, వారి జన్మ స్థానము భారతదేశమని అర్థం చేయించాలి. కృష్ణుడు సాకారుడు కాని వారు(పరమాత్మ) నిరాకారుడు. వారి మహిమ వేరే. ఈ విధంగా యుక్తిగా ఒక కార్టూన్‌ తయారు చేయాలి - దానిని చూచి గీతను వినిపించింది పరమాత్మనే అని, కృష్ణుడిని ఇలా తయారు చేసినవారు పరమాత్మయే అని ఋజువు చేయాలి. జ్ఞానాన్ని బ్రహ్మ పగలు అని, భక్తిని బ్రహ్మ రాత్రి అని అంటారు. ఇప్పుడిది రాత్రి. సత్యయుగాన్ని స్థాపించేదెవరు? బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? సూక్ష్మవతనములోకి కూడా ఎక్కడ నుండి వచ్చాడు? ప్రజాపిత బ్రహ్మను పరమాత్మ దత్తత తీసుకున్నారు. పరమపిత పరమాత్మ రచించిన మొట్టమొదటి సృష్టి సూక్ష్మలోకము. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండరు. అయితే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. కృష్ణుని అంతిమ జన్మలో ఇతడిని పరమపిత పరమాత్మ తన రథముగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా పెద్ద క్లాసు(తరగతి). విద్యార్థులు ఎలా ఉంటారో టీచరుకు తెలుస్తుంది. అటువంటప్పుడు తండ్రి అర్థం చేసుకోలేరా? ఇది అనంతమైన తండ్రికి చెందిన అనంతమైన క్లాసు. ఇచ్చటి విషయాలు అతీతమైనవి, సాటిలేనివి. శాస్త్రాలలో ప్రళయము చూపించి గడిబిడి చేసేశారు.

కృష్ణుడు గీతను వినిపించలేదని మీకు తెలుసు. అతడు గీతా జ్ఞానాన్ని విని రాజ పదవిని పొందాడు. గీతా భగవానుడు నిరాకార శివుడని వారి గుణాలు ఫలానివని మీరు నిరూపించి తెలపాలి. ఈ తప్పు కారణంగానే భారతదేశము గవ్వ సమానంగా తయారయ్యింది. ఇప్పుడు పరమపిత పరమాత్మ జ్ఞాన కలశాన్ని మాతల పై ఉంచారు. మాతలే స్వర్గ ద్వారాలను తెరుస్తారు. ఈ విషయాలన్నీ నోట్‌ చేసుకొని అర్థం చేయించాలి. వాస్తవానికి భక్తి గృహస్థుల కొరకే. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగము. ఋజువు చేసి తెలిపి౦చేందుకే బాప్‌దాదా ఇచ్చటకు వచ్చారు. పిల్లలు యుక్తి యుక్తంగా పని చేయాలి. తండ్రిని ప్రత్యక్షము చేయవలసింది పిల్లలే. సదా హర్షిత ముఖముతో, స్థిరంగా, మస్తీలో(నషాలో) ఉండాలి. పోను పోను ఇటువంటి పిల్లలు తప్పక వెలువడ్తారు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ద్వారా ఇప్పించువారే బ్రహ్మకుమారులు. కుమారీల మహిమ చాలా గొప్పది. వారిలో ముఖ్యమైనది మమ్మా. బాబా జ్ఞానసాగరులు. ఈ బ్రహ్మ గుప్తముగా ఉన్న తల్లి. ఈ రహస్యాన్ని చాలా కొద్దిమంది మాత్రమే కష్టము మీద అర్థము చేసుకుంటారు. మందిరాలు కూడా ఆ మమ్మాకే ఉన్నాయి. గుప్తముగా ఉన్న వృద్ధ (పెద్ద) మమ్మాకు(బ్రహ్మకు) మందిరాలు లేవు. ఈ మాతా-పితలు కంబైండుగా ఉన్నారు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణునిలోకి భగవంతుడు రాజాలడు. గీతా భగవానుని మహిమ వేరే, వారు పతితపావనులు, ముక్తిదాత, మార్గదర్శకుడు..... కనుక పరమాత్ముని మహిమ పూర్తిగా వేరు. ఇరువురూ ఒక్కరే ఎలా అవ్వగలరు? గీతను ఎవరు వినిపించారనేది ముఖ్యమైన విషయము. వేదశాస్త్రాలన్నీ గీతకు పిల్లల వంటివి. మిగిలినదంతా భక్తిమార్గపు సామాగ్రి. జ్ఞాన మార్గములో అవేమీ ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రతి పనిని చాలా యుక్తి యుక్తముగా చేయాలి. హర్షితముతో అచలముగా, స్థిరముగా, జ్ఞాన మస్తీలో ఉంటూ తండ్రిని ప్రత్యక్షము చేయాలి.
2. జ్ఞానములోని నూతన విషయాలను, అపూర్వమైన సాటిలేని విషయాలను నిరూపించాలి.

వరదానము:- ''గమ్యాన్ని (లక్ష్యాన్ని) ముందుంచుకొని తండ్రిని అనుసరిస్తూ మొదటి నంబరు తీసుకునే తీవ్ర పురుషార్థీ భవ''
తీవ్రపురుషార్థుల ముందు సదా గమ్యముంటుంది. వారెప్పుడూ అటు, ఇటు చూడరు. మొదటి నంబరులో వచ్చే ఆత్మలు వ్యర్థము కనిపిస్తున్నా వాటిని చూడరు.వ్యర్థ మాటలు వినిపిస్తున్నా వాటిని వినరు. వారు గమ్యాన్ని లేక లక్ష్యాన్ని ముందుంచుకొని బ్రహ్మాబాబాను అనుసరిస్తారు. బ్రహ్మాబాబా స్వయాన్ని కరన్‌హార్‌గా(చేసేవాడిగా) భావించి కర్మలు చేశాడు. ఎప్పుడూ కరావన్‌హార్‌గా (చేయించేవాడిగా) భావించలేదు. అందువలన బాధ్యతను సంభాళిస్తున్నా సదా తేలికగా ఉండినాడు. అలా తండ్రిని అనుసరించండి.

స్లోగన్‌:- ''ఏ మాటలు స్థితిని చెడిపేస్తాయో, వాటిని వింటున్నా విననట్లు ఉండండి''
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాల
1) ఆత్మ - పరమాత్మకు గల తేడా, భేదము -
ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినాయి, సద్గురువు దళారిగా లభించినప్పుడు సుందరమైన కలయిక చేసేశాడు..... అని అంటారు. ఈ మాటలకు యథార్థమైన అర్థమేమంటే ఆత్మలు పరమాత్మ నుండి చాలాకాలము నుండి విడిపోయాయి. చాలా కాలమంటే అర్థము చాలా సమయము నుండి ఆత్మలు పరమాత్మ నుండి విడిపోయాయి. కనుక ఈ శబ్ధము ఆత్మ, పరమాత్మ వేరే వేరని నిరూపిస్తుంది. రెండిటిలో ఆంతరిక భేదముంది. కాని ప్రపంచములోని మనుష్యులకు తెలియని కారణంగా వారు ఈ శబ్ధానికి అర్థము ఎలా చెప్తారంటే ఆత్మ అయిన నేనే పరమాత్మను కాని ఆత్మ పై మాయ ఆవరించినందున తన అసలు స్వరూపాన్ని మర్చిపోయింది, అది తొలగిపోతే మళ్లీ ఆ ఆత్మనే పరమాత్మగా అవుతుంది. కనుక వారు ఈ అర్థముతో ఆత్మ, పరమాత్మ నుండి వేరని చెప్తారు. ఇంకా కొంతమంది ఆత్మనైన నేనే పరమాత్మను కాని ఆత్మ స్వయాన్ని మర్చిపోయినందున దు:ఖితమైపోయింది, మళ్లీ ఆత్మ ఎప్పుడైతే తనంతకు తాను గుర్తించి శుద్ధమైపోతుందో అది మళ్లీ పరమాత్మతో కలిసి ఒక్కటిగా అయిపోతుంది. కనుక వారు ఈ అర్థముతో ఆత్మను పరమాత్మ నుండి వేరని చెప్తారు. కాని ఆత్మ, పరమాత్మ వేరు వేరని మనకు తెలుసు. ఆత్మ పరమాత్మగా అవ్వలేదని, ఆత్మ పరమాత్మతో కలిసి ఒక్కటిగా అవ్వలేదని అంతేకాక పరమత్మ పై ఏ ఆవరణా ఏర్పడదని మనకు తెలుసు.
2) కర్మ బంధనాలు తెగిపోతేనే మానసిక శాంతిని అనగా జీవన్ముక్త స్థితిని పొందగలరు -
వాస్తవానికి ప్రతి మనిషికి మాకు మానసిక శాంతి లభించాలని తప్పకుండా ఉంటుంది. అందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే మనసుకు ఇంతవరకు శాంతి ప్రాప్తి అవ్వలేదు. అందుకు యథార్థమైన కారణమేది? ఇప్పుడు మొదట మనసు అశాంతిగా అయినందుకు మూల కారణమేది అని ఆలోచించాలి. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణము - కర్మబంధనంలో చిక్కుకోవడం. ఎంత వరకైతే మనసు ఈ పంచవికారాల నుండి, కర్మ బంధనాల నుండి విడుదల అవ్వదో అంతవరకు మనుష్యులు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. ఎప్పుడైతే కర్మబంధనాలు తెగిపోతాయో అప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్త స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. అయితే ఈ కర్మ బంధనాలు ఎలా తెగిపోవాలో ఆలోచించాలి. వాటి నుండి విడిపించేవారు ఎవరు? ఏ మనుష్యాత్మ అయినా వేరే ఏ మనుష్యాత్మనూ విడుదల చేయించలేరు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. చివరికి వారే ఈ జ్ఞాన యోగ బలముతో కర్మబంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. నేను ఆత్మను, అసలు నేను ఎవరి సంతానాన్ని? నా అసలు గుణము ఏది? అనే జ్ఞానము ఎంతవరకు లేదో అంతవరకు కర్మబంధనాలు తెగిపోవు. ఎప్పుడైతే ఈ జ్ఞానము బుద్ధిలోకి వస్తుందో అప్పుడు కర్మబంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తిస్తుంది అనగా పరమాత్మ ద్వారానే కర్మబంధనాలు తెగిపోతాయి.

No comments:

Post a Comment