14-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - వజ్ర సమానమైన జీవితాన్ని తయారుచేసే తండ్రిని చాలా
ఖుషీ ఖుషీగా స్మృతి చేయండి. తద్వారా ఆత్మకు పట్టిన మలినము (తుప్పు)
వదలిపోతుంది''
ప్రశ్న:- మాలలోని మణులుగా ఎవరు తయారవుతారు? దానికి చేయవలసిన పురుషార్థమేమి?
సమా:- చివరి
సమయములో ఎవరికైతే ఇంకేదీ గుర్తు రాదో, వారే మాలలోని మణులుగా తయారవుతారు. ఏ
పిల్లలైతే కర్మాతీత స్థితిని పొందుతారో, వారే మాలలోని మణులుగా అవుతారు.
ఎవరైతే చాలా ధనవంతులుగా ఉన్నారో, అనేక పరిశ్రమలు మొదలైనవి
ఎవరికున్నాయో,.......... వాటన్నిటినీ మర్చిపోవలసి వస్తుంది. ఎవరిలోనూ
మమకారము ఉండరాదు. 'నాది-నాది' అనేది ఉండరాదు. ఎవరిని చూచినా ఇతడు నా
సోదరుడు అనే(ఒక ఆత్మ) ఈ ఆత్మిక సంబంధము మాత్రమే ఉండాలి. ఏ ఇతర సంబంధమూ
ఉండరాదు. ఇటువంటి ఆత్మిక సంబంధాన్ని ఉంచుకొని సర్వమూ మర్చిపోయే పిల్లలే
మాలలోకి రాగలరు.
ఓంశాంతి. ఆత్మిక
తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీకు మేము
ఆత్మలమని, పరమాత్మ అయిన తండ్రికి పిల్లలమని పక్కాగా నిశ్చయమై ఉంటుంది.
కావున అందరూ సోదరులే. సోదరులకు తండ్రి ఆదేశమిస్తున్నారు - పతితపావనులైన
తండ్రినైన నన్ను స్మృతి చేయండి. కావున స్మృతి చేస్తున్నారా? లేక బుద్ధి
యోగము ఏ ఇతర చోట అయినా తిరుగుతూ, వెతుకుతూ ఉందా? మాయ తప్పకుండా
భ్రమింపజేస్తుంది. వద్దనుకున్నా మీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెత్తుతూ
ఉంటుంది. బాబా మాకు సృష్టి చక్ర జ్ఞానమునిచ్చారు. 84 జన్మల కథ చదివించారని,
ఈ 84 జన్మల చక్రము పూర్తి అయిందని, మేము మళ్లీ ఇంటికి వెళ్తామని అనేక
పర్యాయాలు మేము స్మృతియాత్ర ద్వారా ఇంటికి పోయామని మీ బుద్ధిలోకి రావాలి.
అంతేకాక మేమందరమూ భాయి-భాయి అని కూడా మీ బుద్ధిలోకి రావాలి. ఇందులో
శరీరానికి సంబంధించిన విషయమేదీ లేదు. మీరు శరీరాన్ని స్మృతి చేయకండి. కేవలం
మేము ఆత్మలము - మేమే పావనంగా, సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు
పతితమైపోయాము. కావున వజ్ర తుల్యముగా తయారుచేసే తండ్రిని సంతోషంగా స్మృతి
చేయాలి. తద్వారా మలినాలు(తుప్పు) వదిలిపోతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు
- పిల్లలూ, మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది కూడా జ్ఞానమే.
తర్వాత తండ్రిని స్మృతి చేయండి - ఇది విజ్ఞానము. ఎందుకంటే ఆత్మ అయితే
జ్ఞానానికి అతీతంగా విజ్ఞానములోకి అనగా శాంతిధామములోకి వెళ్లాలి. ఆత్మ
స్వధర్మము కూడా శాంతియే. ఇల్లు కూడా శాంతియే. కావున మొదట మనము అచ్చటికి
చేరుకోవాలి. బాబా కూడా అచ్చటి నుండే వచ్చారు. కాని మనుష్యులకు ఈ విషయాలేవీ
తెలియదు.
ఈ పారలౌకిక తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, నేను పరంధామము నుండి మీ వద్దకు డ్రామా ప్లాను
అనుసారము వచ్చాను. ఎందుకు వచ్చాను? మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు
వచ్చాను. ఇప్పుడు మీరు పతితులై వికారులుగా అయిపోయారు. జన్మ-జన్మాంతరాలు
వికారాల ద్వారానే జన్మించారు. అందువలన భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా
ఎలా తయారవ్వాలో ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి
చేస్తే పవిత్ర శ్రేష్ఠాచారులుగా అవుతారు. ఈ స్మృతిలో ఉంటూ మీరు అన్ని పనులు
చేసుకోవచ్చు. అంతేకాని వృత్తి వ్యాపారాదులు చేయకూడదని కాదు. అన్ని పనులు
చేసుకోవచ్చు.
పిల్లలు తండ్రిని అడుగుతున్నారు - బాబా, మాలలోని
మణులుగా ఎవరు అవుతారు? పిల్లలూ, మాలలోని మణులుగా కర్మాతీత అవస్థను
పొందుతారో వారే అవుతారు. వారికి అంతిమములో ఏదీ గుర్తు రాకూడదు. ఎవరైనా చాలా
ధనవంతులుగా ఉన్నారనుకోండి, అనేక ఇండస్ట్రీలు ఉన్నాయని అనుకోండి,........
అవన్నీ మర్చిపోవలసి ఉంటుంది. మీ వద్ద అయితే ఏమీ లేదు. మేము తండ్రి
పిల్లలుగా అయ్యామని పరస్పరము సోదరులమని మీకు తెలుసు. మనకు ఎవరిలోనూ మమకారము
లేదు. నాది-నాది అనేది లేదు కదా. ఇతడు నా సోదరుడనే సంబంధము మాత్రమే ఉంది.
ఇక ఏ ఇతర సంబంధమూ లేదు. ఇలా ఉంటే దానిని ఆత్మీయ సంబంధమని అంటారు. ఇంతవరకు
జీవితమంతా(ఇంత వయసు వరకు) శరీరమే గుర్తుకు వచ్చింది. ఆత్మ అయితే ఎవ్వరికీ
గుర్తు రాలేదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం
చేయిస్తారు - అంతేకాక పావనంగా అయ్యేందుకు పురుషార్థము కూడా చేయిస్తారు.
బాబా పిల్లలైన మీకు సమయము కూడా ఇస్తారు. కేవలం 8 గంటలు నన్ను స్మృతి
చేయండి. అది హద్దు సర్వీసు, ఇది ప్రపంచమంతటికీ సర్వీసు. తప్పకుండా తింటారు,
తాగుతారు, నిదురిస్తారు, తిరుగుతారు,....... రోజంతా అయితే ఎవ్వరూ స్మృతి
చేయలేరు. ఇప్పుడు మీరు తప్పకుండా బేహద్ సర్వీసు చేస్తున్నారు. తండ్రి
ఎలాగైతే విచార సాగర మథనము చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా మథనము చేయడం
నేర్పిస్తారు. వారు కరన్ కరావన్హార్(చేసి చేయించేవారు) కదా. అందువలన
వారు చేసే మీకు నేర్పిస్తారు. పురుషార్థము చేస్తూ చేస్తూ మీ విజయ మాల
తయారైపోతుంది. సత్య-త్రేతా యుగాలలో ఎవరైతే వస్తారో వారంతా విజయులుగా
ఉంటారు. మళ్లీ పాత్రధారులందరూ ఈ నాటకములో పాత్ర చేసేందుకు నంబరువారుగా
వస్తారు. అందరూ కలిసి ఒక్కసారే స్టేజి పైకి రారు. పాత్రధారులైన మీరందరూ
నివసించే స్థానము - బ్రహ్మలోకము. అచ్చట నుండి ఇక్కడకు వచ్చి శరీరాన్ని
ధరిస్తారు. ఈ విషయాలన్నీ చాలా సహజమైనవి. ఇవి పిల్లలైన మీకు మాత్రమే
గుర్తుంటాయి. మీ ఇల్లు స్వీట్ హోమ్, సైలెన్స్ హోమ్. ఇతరులెవ్వరికి కూడా
తమ ఇల్లు ఏదో తెలియదు. వారైతే మేము లీనమైపోతామని అంటారు. ఎలాగైతే
సముద్రములో నీటి బుడగ(గాలి బుడగ) ఏర్పడి మళ్లీ అందులోనే ఇమిడి పోతుందో, అలా
మేము కూడా ఆ బ్రహ్మ తత్వములో లీనమైపోతాము,.......... అని అంటారు. మళ్లీ
వారే ఎచ్చట చూస్తే అచ్చట బ్రహ్మమే బ్రహ్మము అని అంటారు. వారు బ్రహ్మ
తత్వాన్నే ఈశ్వరునిగా భావిస్తారు. అందువలన మీ మాటలు వారి బుద్ధిలో
కూర్చోవు. మీరు వారిని తప్పుగా, వారు మిమ్మల్ని తప్పుగా భావిస్తారు. కాని
ఆత్మలన్నీ శాంతిధామానికి తప్పకుండా వెళ్తాయని మీకు తెలుసు. పోతే ప్రతి
ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది. దీనినే అద్భుతమని అంటారు. పిల్లలైన మీరు
ఇప్పుడు ఎంతో సూక్ష్మములోకి వెళ్తారు, ఎంతో చిన్నదైన ఆత్మ ఏ విధంగా పాత్రను
అభినయము చేస్తుంది! ఎలాగైతే ఈ జ్ఞానము తండ్రి వద్ద ఉందో, వారు
జ్ఞానసాగరులో అలా పిల్లలైన మీ వద్ద కూడా ఉంది. మీరు ఇప్పుడు ఇటువంటి
జ్ఞానయుక్త ఆత్మలుగా అవుతారు. వారు భక్తులు, మీరు జ్ఞానులు. భక్తులనగా
రాత్రిలో(చీకటి) ఉండేవారు. జ్ఞానులనగా పగలు(ప్రకాశము)లో ఉండేవారు. అర్ధ
కల్పము మీరు సుఖధామములో ఉంటారు, అర్ధకల్పము దు:ఖధామంలో ఉంటారు. దీనినే దూర
దృష్టి అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధి చాలా దూర దూరాలకు వెళ్తుంది. మేము
ఆత్మలము, స్వీట్ హోమ్ అనగా బ్రహ్మాండములో ఉండేవారమని మీరు
తెలుసుకున్నారు. తండ్రి ఈ మనుష్య సృష్టికి బీజరూపులు. ఎందుకంటే వారు జ్ఞాన
సాగరులు. వారికి కల్పవృక్ష జ్ఞానము ఉంది. మీరిప్పుడు శరీర భావాన్ని
నశింపజేసేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఏ ఇతర వస్తువూ గుర్తు
రూకూడదు. పూర్తి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. నేను ఆత్మను, నేను ఆత్మను,
ఆత్మనైన నాకు గుర్తు వచ్చే వస్తువు ఏదీ నా వద్ద లేదు. అంత్య కాలములో ఏమేమి
స్మరిస్తారో,........... అని గాయనము కూడా చేయబడ్తుంది. ఏదైనా వస్తువు మీ
వద్ద ఉంటే అది తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇది బాగా ఆలోచించవలసిన విషయము.
ఒకవేళ ఏదైనా ఉంటే ఎవరైనా బంధు మిత్రులు మొదలైన వారుంటే వారు తప్పక
గుర్తుకు వస్తారు. మీరైతే మీ సర్వస్వము శివబాబాకు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత
ఇది నా వస్తువు అని భావించరాదు. ఎప్పుడైతే బాబాకు ఇచ్చేశారో మీకు మళ్లీ
అది గుర్తు ఎందుకు రావాలి? అది మర్చిపోండి. ఒకవేళ అది గుర్తుకు వస్తూ ఉంటే
అది కూడా చివర్లో నష్టము కలుగజేస్తుంది. ఇప్పుడు మీకు ఈ కొత్త కొత్త
విషయాలు లభిస్తాయి. పాత వస్తువు ఏదీ మీ వద్ద లేదు. పాత వస్తువులన్నీ
ఎలాగైతే శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారో, అలా మీరు కూడా మీ సర్వస్వము
ఇచ్చేస్తారు. తర్వాత మళ్లీ గుర్తు రాకూడదు. కేవలం నేను సోదరుడను(ఆత్మను),
బాబా పుత్రుడను, నా వద్ద ఏమీ లేదు, శరీరము కూడా లేదు అని గుర్తుండాలి.
మళ్లీ నూతన ప్రపంచములో అన్నీ కొత్త వస్తువులు లభిస్తాయి. అచ్చట వజ్ర
వైఢూర్య మహళ్లలోకి వెళ్తాము. అది భవిష్యత్తులోని విషయము. బాబా
అడుగుతున్నారు - పిల్లలూ, మీరు ఏ పదవి పొందుతారు? ఏమిగా అవుతారు? అప్పుడు
పిల్లలు బాబా, మేము నారాయణునిగా అవుతాము అని అంటారు. ఇది సంతోషించవలసిన
విషయము కదా. కాని ఇప్పుడు ఏ పాత వస్తువూ గుర్తు రాకూడదు. అప్పుడే మాలలోని
మణులుగా అవుతారు. 108 మాల అయితే రాజులది. మందిరాలలో మళ్లీ 16, 108 మాల కూడా
ఉంటుంది. కావున మాలలోని మణులు చాలానే తయారవుతాయి. ఎంత త్వరగా వస్తారో అంత
సుఖాన్ని పొందుతారు. చివరిలో వచ్చేవారు అంత సుఖాన్ని పొందలేరు. వారికి కొంత
సమయము మాత్రమే సుఖముంటుంది. అలాగే దు:ఖము కూడా తక్కువే ఉంటుంది.
బాబా
అంటున్నారు - పిల్లలూ, చివరి సమయములో ఏదీ గుర్తు రాకూడదు. దేనినైతే అర్పణ
చేశారో అది కూడా గూర్తు రాకూడదు. తండ్రి చెప్తున్నారు - ఏదైనా మిగిలిపోయే
వస్తువు (ఉపయోగపడని వస్తువు)ను, దానికి బదులుగా అచ్చట అనేక రెట్లు ఇవ్వవలసి
వస్తుందో అటువంటి వస్తువును నేను తీసుకోను. ఎందుకంటే నేను పేదలపెన్నిధిని.
చాలామంది యజ్ఞములో ఇచ్చి, ఏదో ఒక కారణము వలన యజ్ఞము నుండి
వెళ్లిపోవునప్పుడు వాపస్ ఇమ్మని అడుగుతారు. మాయ వారిని ఒక్కసారిగా
కాటేస్తుంది. లేకుంటే కొట్టినా, ప్రేమించినా ఈ పిచ్చివాడు మీ గడపను ఎప్పుడూ
వదలిపెట్టను అని అంటారు. ఎప్పుడూ మర్చిపోడు. పిల్లలైన మీరు ఇచ్చట నరుని
నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. మీకు ఎంత గొప్ప వారసత్వము
లభిస్తుంది! నేను ఇచ్చాను అని ఎందుకు అంటారు? మీరు తీసుకుంటారు కదా, మీరు
ఏదైనా ఇవ్వండి అని మిమ్ములను ఎవరు అడుగుతారు? కాకుంటే ఎవరైనా ఒక్క పైసా
ఇచ్చినా అచ్చట వారి కొరకు మహలు తయారవుతుంది. సుదాముడు ఇచ్చిన పిడికెడు
అటుకుల ఉదాహరణముంది కదా. అందువలన పిల్లలు సుదాముని వలె బియ్యము, పప్పులు
తీసుకొని వస్తారు. మాకు మహళ్లు లభిస్తాయని భావిస్తారు. అటువంటి పిల్లలను
చూసి తండ్రి చాలా సంతోషిస్తారు. 'వాహ్' నూతన ప్రపంచములో వీరికి మహళ్లు
తయారవుతాయి. ఎందుకంటే చాలా ప్రీతితో సద్భావనతో తీసుకొస్తారు. అటువంటి
పిల్లలది అహో సౌభాగ్యము! వారు చాలా ఉన్నతమైన పదవి పొందుతారు.
ఇప్పుడు
డ్రామా ప్లాను అనుసారము బాబా మరియు పిల్లలైన మీ నడవడిక అడుగడుగునా
కల్పక్రితము ఎలా ఉండేదో అలాగే నడుస్తుంది. మీ ప్రతి అడుగులో పదమ్ ఉంది.
దేవతల అరికాళ్లలో పద్మాన్ని చూపిస్తారు. దీనికి కూడా ఏదైనా అర్థముంటుంది
కదా. ఇప్పుడు మీకు పదమాల సంపాదన జరుగుతూ ఉంటుంది. మీరు బాబా వద్దకు
పదమాపతులుగా తయారయ్యేందుకు వస్తారు. కావున మీరు ఎంతో గొప్ప మహోన్నత,
మహోన్నత, మహోన్నతమైన భాగ్యశాలురు! కాని అందులో కూడా నంబరువారు
పురుషార్థానుసారము ఉన్నారు. ఎలాగైతే డ్రామా మీతో పురుషార్థము చేయిస్తూ
ఉంటుందో, కల్ప-కల్పము డ్రామా ప్లాను అనుసారము మీ పురుషార్థము అలాగే నడుస్తూ
ఉంటుంది. ఈశ్వరుడు కూడా డ్రామానుసారమే మీకు మతమునిస్తారు. కావున వారు
డ్రామాకు వశమయ్యారు కదా. అయితే ఈ డ్రామా ఎవరి వశములో ఉంది? పిల్లలూ, ఇది
అనాదిగా తయారైన డ్రామా. డ్రామా ఎప్పుడు తయారయిందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది
నడుస్తూనే ఉంటుంది. డ్రామాలో నంబరువన్ మతము ఈశ్వరుని మతము. అందువలన దానిని
ఈశ్వరీయ మతము అని అంటారు. అది మిమ్ములను దేవతలుగా చేస్తుంది. మనుష్యుల
మతము ఛీ - ఛీగా తయారు చేస్తుంది. ఈశ్వరీయ మతము ద్వారా మీరు మనుష్యుల నుండి
దేవతలుగా అవుతారు. మళ్లీ 21 జన్మల తర్వాత మనుష్యుల మతము అనుసరించి మీరు
మనుష్యులుగా అయిపోతారు. ఇప్పుడు ఈ గీతా ఎపిసోడు(అధ్యాయము) సంగమ యుగము. ఈ
సమయములో ప్రపంచము పరివర్తన అవుతుంది. అందువలన ఈ విషయము పిల్లల బుద్ధిలో
ఉండాలి, అంతేకాక పిల్లలు చాలా చాలా మధురంగా తయారవ్వాలి, ప్రీతితో
నడుచుకోవాలి. ఏ పిల్లలైతే శాంతిగా, మధురంగా ఉంటారో వారి పదవి కూడా ఉన్నతంగా
ఉంటుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ బుద్ధి లభించింది. మనము అనంతమైన బాబా
సంతానంగా అయ్యామని, బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీరు అర్థము
చేసుకున్నారు. కావున అపారమైన సంతోషముండాలి. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ,
ఇచ్చటి మీ పదవి స్వర్గములోని పదవి కంటే చాలా చాలా ఉన్నతమైనది. తండ్రి
కేవలం మిమ్ములను చదివిస్తారు. భగవానువాచ - నేను మిమ్ములను డబల్ కిరీటధారి
రాజాధి రాజుగా తయారుచేస్తాను. అందువలన మీ భాగ్యము పై మీకు చాలా ఖుషీ
ఉండాలి. ఓహో! బాబా వచ్చి మా భాగ్యాన్ని ఎలా తయారుచేస్తున్నారు! రాయి వలె
ఉన్న జీవితాన్ని వజ్ర సమానంగా చేసేస్తారు అని సంతోషంగా ఉండాలి. మంచిది.
మధురాతి
మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఉన్నత పదవి పొందేందుకు చాలా చాలా శాంతచిత్తులుగా ఉండాలి, మధురంగా తయారవ్వాలి. అందరితో ప్రీతిగా నడుచుకోవాలి.
2.
బాబాకు ఏమేమి అర్పణ చేశారో వాటన్నిటిని మర్చిపోవాలి. అవి జ్ఞాపకము కూడా
రాకూడదు. బాబాకు మేము ఇస్తున్నామని సంకల్పము ఎప్పుడూ రాకూడదు.
No comments:
Post a Comment