Friday, 3 November 2017

Telugu Murli 16/10/2017

16-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - జ్ఞానములో మాయ ద్వారా విఘ్నాలు రావు, యోగములో వస్తాయి. యోగము లేకుండా చదువు ధారణ జరగజాలదు. కనుక వీలైనంత ఎక్కువగా యోగములో ఉండే పురుషార్థము చేయండి.''
ప్రశ్:- క్రింద పడిపోయిన పిల్లలను బాబా ఏ విధంగా పైకి ఎత్తుతారు?
సమా:- బాబా అటువంటి పిల్లలను తరగతిలో పొగుడ్తారు, బుజ్జగించి ప్రేమిస్తారు, ధైర్యమిస్తారు. పిల్లలూ, మీరు చాలా మంచివారని అంటారు. మీరు జ్ఞాన గంగలుగా అవ్వగలరు. మీరు ఈ విశ్వానికి రాజులుగా అయ్యేవారు. నేను మీకు ఉచితంగా చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. మరి మీరెందుకు తీసుకోరు? రాహు గ్రహణము ఏమైనా పట్టి ఉందా? మురళి చదువుతూ యోగము చేస్తే మీ గ్రహణము వదిలిపోతుంది. ఇటువంటి ధైర్యమును ఇప్పించుట వలన పిల్లలు మళ్లీ తలంపు, చదువులో లగ్నమైపోతారు. ఈ విధి ద్వారా చాలా మంది పిల్లల గ్రహచారము వదిలిపోతుంది.
పాట:- దూరదేశములో ఉండే,...............( దూర్‌దేశ్‌ కే రహ్‌నే వాలా,..........)
ఓంశాంతి. భగవానువాచ! గీతలోని రెండు పదాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాటినే వింటూ వచ్చారు. ఈ గీతా శాస్త్రము స్వర్గములో లేదు. తర్వాత దీనిని మనుష్యులు కూర్చుని తయారు చేశారు. అందువలన భగవానువాచ - ఏమంటున్నారు? పిల్లలూ! - ''మన్మనాభవ'' ఇది మీరు వింటూ వచ్చిన సంస్కృత పదమే. దాని అర్థము ఎవ్వరూ తెలుసుకోలేరు. వస్తూనే మన్మనాభవ అని అంటారు. శ్రీ కృష్ణ భగవానువాచ అయితే కృష్ణుడు, పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అంటాడా? కావున ఇది అసత్యమైపోయింది కదా. ఇచ్చట పరమపిత పరమాత్మ శివుడు సాలిగ్రామాలకు - మన్మనాభవ అని చెప్తున్నారు. అనగా పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అర్థము. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మృత్యువు సమీపిస్తోంది. గురువులు సోదరులు, బంధువులు ఎవరైనా మరణించే స్థితిలో ఉన్నప్పుడు రామ, కృష్ణ అని అనమంటారు లేక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు లేక ఎవరిదైనా గురువు చిత్రాన్ని వారి ముందుంచుతారు. ఇచ్చట మనుష్యులందరు మృత్యువు పాలు కావలసిందే. అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ శబ్ధము నుండి అతీతంగా పరంధామము, నిశ్శబ్ధ ప్రపంచములోకి వెళ్లాలి. దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు. అది ఆత్మల ప్రపంచము. ఇక్కడకు వచ్చినప్పుడు ఆత్మ సాకారంగా అవుతుంది. అక్కడ శరీరము లేదు. ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను వాపస్‌ తీసుకెళ్లేందుకు వచ్చాను. నేను మృత్యువుకే మృత్యువును. అమృతసర్‌లో ఒక అకాల సింహసనాన్ని కూడా ఉంచారు. అకాల్‌(అకాలుడు) అనగా కాలుడు కబళించలేనివారు. ఇప్పుడు మృత్యువుకే మృత్యువు అయిన బాబా చెప్తున్నారు - నేను మిమ్ములను వాపస్‌ తీసుకెళ్తాను. మీరు మళ్లీ పాత్రను అభినయించేందుకు రావాలి. సృష్టి ఆదిలో మొదట ఎవరి పాత్ర నడిచింది? ఎందుకంటే ఈ సృష్టి విభిన్న ధర్మాల వృక్షము. అందరూ నంబరువారుగా వస్తారు. మొదటిది దేవతా ధర్మము. ఇప్పుడా ధర్మము ప్రాయ: లోపమైపోయింది. దాని జ్ఞానము కూడా లోపించింది. కావున శాస్త్రాలలో అదెక్కడ ఉంది? ఏ సహజ రాజయోగముతో వారు దేవతలుగా అయ్యారో అది కూడా మాయమయ్యింది. మిగిలిన ఈ గీత మొదలైనవి భక్తి సామాగ్రి. ఎందుకంటే ఈ జ్ఞానము మీకు ఇక్కడ మాత్రమే లభిస్తుంది. దాని శాస్త్రాలు సత్య-త్రేతా యుగాలలో ఉండవు. కావున ద్వాపరములో ఎక్కడ నుండి వస్తుంది? అక్కడ మీ సత్యమైన గీత మొదలైనవేవీ ఉండవు. అక్కడ మళ్లీ డ్రామానుసారము అదే భక్తి మార్గపు గీత మొదలైనవి తయారు చేస్తారు. పూర్వము సాధు మహాత్ముల బుద్ధి బాగుండేదని అంటారు. కనుక ఈ శాస్త్రాలు మొదలైనవి వారే కూర్చుని తయారు చేశారని అంటారు. డ్రామానుసారము తయారవ్వాల్సే ఉంది. ఆ సమయంలో వాస్తవిక విషయము ఎక్కడి నుండి రాగలదు? ఉదాహరణానికి గాంధీతో పాటు మోతీలాల్‌ మొదలైనవారి పాత్ర ఉండేది. ఇప్పుడు ఆ నాటకము తయారుచేస్తే వారిప్పుడెలా వస్తారు? అదే విధంగా ఈ శాస్త్రాలు కూడా కృత్రిమంగా తయారుచేస్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన నడుస్తూ ఉంది. దేని స్థాపన? సత్యయుగము కొరకు దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోందని పిల్లలకు తెలుసు. కావున నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్నారు కనుక టేపు వినాలి లేదా మురళి రివైజ్‌ చేయాలి లేక యోగము చేయాలి. అలా చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. రోజంతా పనిలో ఉంటారు. అచ్చట యోగము అసలే చేయరు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది. మాయ జ్ఞానము నుండి దూరము చేయదు. యోగము నుండి దూరము చేస్తుంది. సంకల్ప, వికల్పాలు యోగములో ఉండనివ్వవు. చదువులో ఇన్ని విఘ్నాలు ఏర్పడవు. అయితే యోగము లేకుండా చదువు ధారణ అవ్వదు. జ్ఞానము కంటే యోగము సులభమైనది. వృద్ధ మాతలు మా బుద్ధిలో ఇన్ని పాయింట్లు కూర్చోవు అని అంటారు. వారికి కూడా బాబా, '' అయితే నన్ను స్మృతి చేయండి '' అని అంటారు.

హే భక్తులారా! - అని బాబా అంటారు. అందరూ భక్తులే అయితే మీరు అపురూపమైన భక్తులు. పూర్తిగా అర్ధకల్పము భక్తి చేశారు. అందరూ పూర్తిగా భక్తి చేయరు. ఇక్కడకు వచ్చునంత వరకు భక్తి చేస్తూనే ఉంటారు. అయితే మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. అది కూడా పిల్లల ద్వారా తెలిసిపోతుంది. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు శ్రీమతమును అనుసరిస్తారు. వారు మన కులానికి చెందిన వారని అర్థమవుతుంది. స్వయం పరమాత్మయే మమ్ములను చదివిస్తున్నారని ఎవరికైతే పూర్తి నిశ్చయముంటుందో వారు స్వంత పిల్లలు. స్వంత పిల్లలు బలిహారమౌతారు. సవతి పిల్లలు బలిహారమవ్వరు. బలి అయ్యేందుకు భయపడరాదు. భక్తిలో అయితే బలి అవుతూ వచ్చారు. ఏదో ఒకటి ఈశ్వరార్థము దానము చేస్తూనే వచ్చారు. ఇది కూడా బలి అవ్వడమే. మళ్లీ పరమాత్మనే కొడుకునిచ్చాడని, ధనమిచ్చాడని అంటారు. అయితే మనుష్యులకు దీని అర్థము తెలియదు. మీకిప్పుడు - ఇది కూడా భక్తికి ఫలితంగా తండ్రి అల్పకాలానికి ఇస్తూ వచ్చారు. సత్యయుగములో ఇలా ఉండదు, జరగదు. మీరు భక్తిలో ఏమి చేస్తూ వచ్చారో అది సత్యయుగములో చేయరు. దానము చేసేందుకు అక్కడ పేదవారెవ్వరూ ఉండరు. ఏ శాస్త్రమూ ఉండదు, ఏ మందిరమూ ఉండదు. ఇదంతా భక్తి మార్గములోని సామాగ్రి. సత్యయుగములో ఇవన్నీ ఉండవు. ఈ జ్ఞానము కూడా ప్రాయ: లోపమైపోతుంది. అచ్చట ప్రాలబ్ధము పొందుకునే పురుషార్థమేదీ లేదు. ప్రాలబ్ధమంతా ఇప్పటి పురుషార్థానిదే. ఇస్లాము, బౌద్ధుల జ్ఞానమైతే పరంపరగా నడుస్తుంది. ఎందుకంటే వాటి స్థాపన తర్వాత వినాశనము జరగదు. కనుక వాటిని గురించి అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. అనగా వాటిని గురించి చరిత్ర ఉంటుంది. కానీ మీ తర్వాత వినాశనము జరుగుతుంది. అందులో అంతా సమాప్తమైపోతుంది. మళ్లీ ద్వాపరములో అవే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ వెలువడ్తాయి. ఇవన్నీ గీత సంతానమే. వాటిని ధర్మ శాస్త్రాలని అనరు. ఎందుకంటే దేని ద్వారా ధర్మ స్థాపన జరుగుతుందో దానినే ధర్మ శాస్త్రమని అంటారు. ఉదాహరణానికి ఏసుక్రీస్తు మహావాక్యాలను సందేశకుని మహావాక్యాలని అంటారు కదా. ఏసుక్రీస్తును గాడ్‌ఫాదర్‌ అని అనరు. అతడిని భగవంతుని పుత్రునిగా భావిస్తారు. గాడ్‌(భగవంతుడు) క్రైస్తవ ధర్మ స్థాపన చేసేందుకు ఏసుక్రీస్తును పంపించారని అంటారు. కావున అతడు తాను స్థాపించిన ధర్మాన్ని పాలన కూడా చేయాలి. సతో, రజో, తమోలో వచ్చి తీరాలి. వాపస్‌ ఎవ్వరూ వెళ్లలేరనే జ్ఞానము అతడికి ఉండదు.

మంచిది. వారు తయారుచేసిన గీత స్మృతిచిహ్నమని బాబా అర్థం చేయించారు. అది దేవతా ధర్మ శాస్త్రమయినా దానిని అసత్యంగా తయారు చేశారు. అందులో సత్యము పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. ఎందుకంటే జరిగిన తర్వాత కూర్చుని తయారు చేశారు. సత్య త్రేతా యుగాలలో జ్ఞానమెవ్వరికీ లేదు. సత్యయుగములో ఉన్న బంగారు, వజ్రాల మహళ్లు ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్లాయో, ఎందుకు పోయాయో వారికి తెలియనే తెలియదు. సముద్రములో ద్వారకా పట్టణము మునిగిపోయిందని అంటారు. అయితే సముద్రములో మునిగి పోదు. భూకంపాలు మొదలైనవాటిలో అన్నీ సమాప్తమైపోతాయి. తర్వాత స్వర్గ నామ-రూపాలు కూడా ఉండవు. ప్ర్రాలబ్ధాన్ని అనుభవించి సమాప్తము చేశారు కనుక వారి నామ-రూపాలేవీ ఉండవు. చరిత్ర కూడా ఉండదు. మందిరాలు నిర్మిస్తే వాటి చరిత్ర ఉంటుంది. పూజ ఎప్పటి నుండి మొదలయ్యింది? గజనీ మొహమ్మద్‌ ఎప్పుడొచ్చాడు? భారతదేశ ధనాన్ని ఎలా దోచుకున్నాడు? ఈ జ్ఞానమంతా బుద్ధికి భోజనము వంటిది. అయితే యోగము సరిగ్గా లేకుంటే వినే సమయములో సంతోషముంటుంది. కానీ నిలబడదు. పవిత్రంగా లేకుంటే అసలే నిలువదు. ఇది ఎవరి వశమూ కాదు. ఇది శాస్త్రాల జ్ఞానము కాదు. అదైతే అందరూ కంఠస్థము చేస్తారు. ఇది 21 జన్మల కొరకు చదువు. అక్కడ సత్యయుగంలో భలే తండ్రి సింహాసనము పై కూర్చుంటారు. కాని అది కూడా ఇచ్చటి సంపాదనకు ప్రాలబ్ధమే. వారసత్వము కాదు. దేవతలు ఒకరికొరు వారసత్వమునివ్వరు. అందువలన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. మీరు మమ్మా - బాబాలను అనుసరించాలి. వారు సన్యాసులకు నామమాత్రపు అనుచరులుగా ఉంటారు. అచ్చట దేవీ దేవతల రాజ్యముంటుంది. యథా రాజా - రాణి, భగవతి - భగవాన్‌ తథా ప్రజలుగా అయ్యేందుకు(రాజా-రాణి అంటే భగవాన్‌ భగవతి ఎలా ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు) తండ్రి చదివిస్తున్నారు, అంతేకాని ఆశీర్వదించరు. వారు మనలను చదివించడమే ఆశీర్వాదము. మీరు ఆశీర్వదిస్తే, నూరు మార్కులు వస్తాయని టీచరుతో అంటారా? బాబా చదివిస్తారు. ఈ చదువు అందరి కొరకు. క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ అందరూ సర్వధర్మాన్‌ పరిత్యజ్య....... అని అంటారు కదా. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. బాబా చెప్తున్నారు - '' ఇవన్నీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. '' ఆత్మలన్నీ అవినాశి. ఒకే తండ్రి పిల్లలు కదా. కావున అమ్మ, నాన్న, చిన్నాన్న మొదలైన దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఒంటరి ఆత్మనని నిశ్చయము చేసుకొని నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. అందుకు ఏ ఇతర మార్గమూ లేదు. దీనినే యోగాగ్ని అని అంటారు.''

బాబా ఉత్తరాలలో మధువనములో రాత్రి సమయములో జరిగిన చిట్‌చాట్‌ (పిచ్చాపాటి) ఉంటుంది. మధువనములో బాబా నవ్విస్తారు, ఉత్సాహము కూడా కలిగిస్తారు. నీవు చాలా మంచిదానవు, జ్ఞాన గంగగా అవ్వగలవు అని అంటారు. టెలిఫోన్‌ ఆఫీసులో నౌకరీ చేస్తున్నావా? నీవు మహారాణిగా తయారయ్యే దానివి అంటూ క్రిందపడే వారిని కూడా ఉద్ధరిస్తారు. చాలా మందికి రాహు గ్రహణము పట్టుకుంటుందని, అది నాకు తెలుసునని బాబా అంటారు. సమాచారము వస్తే బాబా వారిని పైకెత్తుతారు. నేను ఉచితంగా చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వస్తే మీకేమయింది! రాహు గ్రహణము పట్టిందా? యోగము చేయండి, మురళి వినండి..... ఇటువంటి పత్రాలు వ్రాయాల్సి వస్తుంది. చాలా రకాలైన జాబులు వస్తాయి. ఎవరికైనా ఎవరితోనైనా మనస్సు లగ్నమైతే పరస్పరము గాంధర్వ వివాహము చేసుకుంటామని ప్లాను తయారు చేసుకుంటారు. నేను నిన్ను రక్షిస్తాను, బంధనము నుండి విడిపిస్తాను అని అంటారు. నీవెలా రక్షిస్తావని బాబా అంటున్నారు. మొదట నీవు మాయ నుండి రక్షింపబడ్డావా? బాబాతో సలహా తీసుకున్నావా? శ్రీమతము తీసుకోకుండా పరస్పరము పెళ్లి మాటలు మాట్లాడుకుంటారా! కావున ఓ శవాల్లారా! మాయ మిమ్ములను ఈడ్చుకుని పోతుంది. సూక్ష్మములో మనస్సు తగులుకుంటే ఇటువంటి మాటలు (వివాహపు మాటలు) మాట్లాడ్తారు. ఇటువంటి వారు రసాతలములోకి పోతున్నారని బాబాకు అర్థమైపోతుంది. నిశ్చితార్థము ఎప్పుడూ తల్లితండ్రులే చేస్తారు. మీరు ముట్టె(బుడంకాయలు, చిన్నవారు), కుర్రవాళ్లు. పరస్పరము మీరే రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారా? ఇటువంటి విఘ్నాలు వస్తాయని మీకు తెలియదు. బెల్లానికి, బెల్లపు సంచికే (శివబాబాకు, బ్రహ్మబాబాకు) మాత్రమే దాని రుచి తెలుస్తుంది. బాబాకు పిల్లలందరి గూర్చి తెలుసు. బాబా నేను మీ ''స్వంత బిడ్డనా, సవతి బిడ్డనా'' అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు శరీరాన్ని వదిలితే ఏ పదవిని పొందుకుంటాను? అని అడగవచ్చు. శరీరము పై ఏ నమ్మకమూ లేదు. స్టీమర్లు మునిగిపోతాయి. విమానాలు పడిపోతాయి. అప్పుడు గతి ఏమౌతుంది? మృత్యువు అందరి తలల పై నాట్యము చేస్తూ ఉంది. కావున ఈ రోజు పని రేపటికి వాయిదా వేయకండి. లేకుంటే - '' చూడు రేపు-రేపు అంటూ మృత్యువు తినేసింది'', శ్రీమతమును అనుసరించకుండా రాజ్య పదవి పోగొట్టుకున్నావు'' అని ధర్మరాజపురిలో సాక్షాత్కారమౌతుంది. కొద్దిగా వింటున్న వారైతే స్వర్గములోకి వచ్చేస్తారు. మళ్లీ స్థాపనలో ఎవరెంత సహయెగము చేస్తారో అంత పదవిని పొందుతారు. గాంధీగారికి సహాయము చేసినవారు ఎంతమంది జైలుకెళ్లారు! ఎంతమంది మరణించారు, ఫలితంగా ఏమి లభించింది? ఎవరైనా ధనవంతులైన కాంగ్రెసు వారి వద్ద జన్మించి ఉంటారు. ఇప్పుడు చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. మరి వారికి ఏ సుఖము లభించింది? కాని జ్ఞానము విని వెళ్లిపోతే అది వ్యర్థమవ్వదు. ఇక్కడ దేనినీ వదిలించరు. ఈమెను వారు వికారాల కొరకు విసిగించారు. అందుకే విధి లేక ఆమె వారిని(ఆమె భర్తను) వదలవలసి వచ్చింది. లేకుంటే ఏమి చేస్తుంది! అందువలన తండ్రి ఆమెకు రక్షణ ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు కూడా శరణు తీసుకుంటూ ఉంటారు. ఇందులో తీసుకెళ్లే విషయమే లేదు. డ్రామానుసారము ఈ గోశాల తయారవ్వవలసి ఉండింది. నిజానికి ఇది పిల్లల విషయము, కాని వారు గోశాల అని పేరు పెట్టేశారు. కృష్ణుడు నది దాటి వెళ్తే ఆవులు కూడా దాటుకొని ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి విషయాలే. వీటన్నిటి కంటే ముందు జ్ఞానము తీసుకోండి. తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. భలే మీ వ్యాపారాలు చేసుకోండి, దానితో పాటు ఈ రెండవ కోర్సు తీసుకోండి. విదేశాలలో ఉంటున్నా మురళి తప్పక చదవండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహ సంబంధాలను మరిచి స్వయాన్ని ఒంటరి ఆత్మగా భావించాలి. తండ్రికి పూర్తిగా బలిహారమవ్వాలి. ఇందులో భయపడరాదు.
2. ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడేందుకు ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయరాదు. చదువు ఆధారంతో తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి.

వరదానము:- ''కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ (సమతుల్యత) ద్వారా నిర్ణయ శక్తిని పెంచుకునే సదా నిశ్చింత భవ''
ఎవరి బుద్ధి అయితే సమయానికి యదార్థమైన జడ్జిమెంటునిస్తుందో వారే నిశ్చింతులుగా ఉంటారు. ఎందుకంటే రోజురోజుకు సమస్యలు, పరిస్థితులు ఇంకా టైట్‌ అవుతాయి (బిగుసుకుంటాయి). అటువంటి సమయంలో కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ఉంటే నిర్ణయశక్తి ద్వారా సహజంగా వాటిని దాటుకుంటారు. ఈ బ్యాలన్స్‌ కారణంగా బాప్‌దాదా ద్వారా ఏ ఆశీర్వాదాలైతే ప్రాప్తిస్తాయో వాటి వలన ఎప్పుడూ సంకల్పములో కూడా ఆశ్చర్యము కలిగించే ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. ఇలా ఎందుకు జరిగింది? వీరికేమయింది?..... ఇటువంటి ప్రశ్నలు రావు. ఇప్పుడేం జరుగుతూ ఉందో అందులో కళ్యాణము దాగి ఉంది అని సదా పక్క నిశ్చయముంటుంది.

స్లోగన్‌:- ''ఒక్క బాబాతో సర్వ సంబంధాల రసము తీసుకోండి, ఇంకెవ్వరి స్మృతీ రాకూడదు''

No comments:

Post a Comment