Sunday, 5 November 2017

Telugu Murli 02/11/2017

02-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - వికారాలను దానిమిచ్చిన తర్వాత కూడా స్మృతిలో ఉండేందుకు పురుషార్థము తప్పకుండా చేయాలి. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది''

ప్రశ్న:- బాబా హృదయసింహాసన అధికారిగా లేక రుద్రమాలలో కూర్చబడేందుకు విధి ఏది?
ఉత్తరం :- తండ్రి సమానంగా దు:ఖహర్త-సుఖకర్తలుగా అవ్వండి. అందరి పై జ్ఞాన జలపు తుంపర్లు చల్లి శీతలంగా చేసే సేవ చేయండి. ఎవరికైనా దు:ఖము కలిగించే మాటలను వదిలేయండి. ఎలాంటి వికర్మలూ చేయకండి. మంచి నడవడికలను (మ్యానర్స్‌) ధారణ చేయండి. మీ సమయాన్ని తండ్రి స్మృతిలో సఫలము చేసుకుంటే, తండ్రి హృదయసింహానాధికారులుగా తయారై రుద్రమాలలో కూర్చబడ్తారు. ఒకవేళ ఎవరైనా తమ సమయాన్ని వ్యర్థము చేసుకుంటే తమ పదవిని అనవసరంగా పాడు చేసుకుంటారు.అసత్యము చెప్పడం, తప్పు చేసి దాచిపెట్టడం, ఎవరి హృదయానికైనా దు:ఖము కలిగించడం - ఇవన్నీ పాపాలే. దీని వలన నూరు రెట్ల శిక్ష లభిస్తుంది.

పాట :- వారు మా నుండి వేరు కారు, మేము వారి నుండి,......... (వహ్‌ హమ్‌ సే కభీ భీ జుదా న హోగే,.........)   
ఓంశాంతి. ఇది గోపికల పాట. ఆ గోపికలు ఎవరు? ప్రజాపిత ముఖవంశావళివారు. వారినే గోపీ వల్లభుని అనగా తండ్రికి చెందిన గోప గోపికలు అని అంటారు. మిగిలినవన్నీ వట్టి కథలే. ఎప్పుడైతే మీరు ఈశ్వరుని వారిగా అయ్యారో, అప్పుడు ఆసురీ వికారీ సంప్రదాయాలు మీకు శత్రువులుగా అవుతాయని అర్థం చేసుకోవాలి. హంసలు, కొంగలు కలసి ఉండలేవు. హంసలు చాలా కొద్దిగా ఉంటాయి. కొంగలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. దీని గాయనము కూడా - గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండండి అని ఉంది. విఘ్నాలైతే చాలా వస్తాయి. అర్ధకల్పము నుండి పతితులుగా ఉన్నారు. అంత సులభంగా, త్వరగా పావనంగా అయిపోరు. వికారాల కొరకు ఎన్నో గొడవలు, పెనుగులాటలు జరుగుతూ ఉంటాయి. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది పిలిచింది కూడా అందుకే. ద్రౌపది ఒక్కరు కాదు. ఈ సమయములో అందరూ ద్రౌపదులే, అందరూ దుశ్శాసనులే. చీరలు వలుస్తూ అవమానపరుస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే పతిత వికారీ ప్రపంచము. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇది వికారీ ప్రపంచము, రావణ రాజ్యము. ఈ ప్రపంచములో ఎంతో దు:ఖముంది. ఏడ్వడం, బాదుకోవడం, కొట్లాటలు, జగడాలు ఏమేమో జరుగుతున్నాయి! నూతన ప్రపంచములో దేవతలు రాజ్యపాలన చేయునప్పుడు పవిత్రత, సుఖ-శాంతులుండేవి.అశాంతినిచ్చే ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడైతే అశాంతిని వ్యాపింపజేసే ధర్మాలు అనేకమున్నాయి. అందరికంటే పాత శత్రువు రావణుడని, అతడు భారతదేశాన్ని చిల్లిగవ్వ సమానంగా పతితంగా చేశాడని నిరూపించి చెప్తారు. తండ్రి కూర్చుని కర్మ - అకర్మ - వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో ఎవరు ఎన్ని దాన-పుణ్యాలు చేసినా, యజ్ఞ జప తపాదులు ఆచరించినా, క్రిందికి దిగే తీరాలి. ఎవరికి దానము చేస్తారో, వారు కూడా వికారీ పాపాత్మలే. వికర్మలు చేస్తూ చేస్తూ ఇప్పుడు తలపై చాలా భారముంది. సతోప్రధానంగా ఉండిన ఆత్మలే ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాయి. ఈ విషయాలన్నీ కల్పక్రితము వలె తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయించి మనలను కల్ప-కల్పానికి దేవతలుగా చేస్తారు. సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.ఇది సులభమే కదా.అందరూ ఓ భగవంతుడా! రండి అని పిలుస్తారు. పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయండని అంటారు. అందువలన పతితపావనుడు తండ్రి ఒక్కరు మాత్రమే కదా. మనము పావనంగా తయారయ్యేందుకు తండ్రి మనతోనే పురుషార్థము చేయిస్తారని మీకు తెలుసు. భలే ఎవరైనా 5 వికారాల దానమిస్తారు. అంతమాత్రానికే సరిపోదు. మళ్లీ యోగము కూడా జోడించాలి. జన్మ-జన్మాంతరాలుగా తల పై ఉన్న పాపభారము, దేని ద్వారా మీరు తమోప్రధానంగా అయ్యారో ఆ పాపభారము యోగము చేయకుంటే ఎలా భస్మమైపోతుంది?

మీరు పంచ వికారాలు దానము చేసి ఇక ఏ పాప కర్మలూ చేయమని అంటారు. కాని జన్మ-జన్మాంతరాల లెక్కాచారము ఏదైతే ఉందో, అది ఎలా సమాప్తమైపోతుంది? దానికి యుక్తి ఏమంటే ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రి స్మృతిలో ఉండాలి. ఈ తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. పతిత ఆత్మలు అచ్చటికి వెళ్ళలేవు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర, తమ-తమ పదవి లభించే ఉంది. మనుష్యులకు హోదా ఎలా ఉంటుందో అలా ఆత్మలకు కూడా హోదా ఉంటుంది. మొట్టమొదట ఆత్మ స్వర్గములోకి వస్తుంది. మొదటి నంబరులో లక్ష్మీ నారాయణులు ఉన్నారు. వారిది అందరికంటే పెద్ద పాత్ర, డ్రామాలో దేవీదేవతా ధర్మానికి చెందిన ఆత్మలు అందరికంటే మంచి పాత్ర అభినయించి అందరికంటే ఎక్కువ సుఖము అనుభవిస్తారు. తర్వాత సతో, రజో, తమోలోకి రావలసి ఉంటుంది. మురికి(వికారము) కలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మురికి ఎలా తొలగాలి? బంగారును అగ్నిలో వేస్తే మలినాలు తొలగుతాయి. ఇది యోగాగ్ని, దీని ద్వారా వికర్మలు వినాశనమవ్వగలవని ఎవ్వరికీ తెలియదు. మాటిమాటికి యోగము తెగిపోతుందని, తండ్రిని మర్చిపోతామని పిల్లలంటారు. ఇవి మాయ కల్పించే విఘ్నాలు. విఘ్నాలు రాకూడదని యోగము త్వరగా జోడించాలని, త్వరగా వినాశనము అయిపోవాలని అనుకుంటారు. కాని అలా జరగదు. సమయము పడ్తుంది. అంతవరకు మీరు యోగము చేస్తూనే ఉండాలి. చివరిలో కర్మాతీత అవస్థ వస్తుంది. అప్పుడు ప్రపంచము కూడా సమాప్తమైపోతుంది. మీరు శ్రీమతము ద్వారా రావణుని పై విజయము పొందుతారు. గీత, మహాభారతము, రామాయణము అన్నిటిలోనూ భక్తి సామాగ్రి ఉంది. మీరు సంగమ యుగములో ఏ కర్తవ్యాలు చేశారో, వాటి స్మృతిచిహ్నాలుగా ఈ మందిరాలు మొదలైనవి తయారయ్యాయి. స్మృతి చిహ్నాలు తయారవ్వడం ద్వాపర యుగము నుండి ప్రారంభమౌతాయి. మొట్టమొదట పరమపిత పరమాత్మ ఎవరైతే వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేస్తారో ఆ శివుని స్మృతి చిహ్నము (శివలింగము) తయారౌతుంది.దేవతల మహిమ గాయనము చేయబడ్తుంది.లక్ష్మీనారాయణులకు చాలా పెద్ద మందిరాలున్నాయి. వారికి ఇంత పూజ ఎందుకు జరుగుతోంది? దీనికి జవాబు ఎవ్వరికీ తెలియదు. పూజ్యుల నుండి మళ్లీ పూజారులుగా తప్పకుండా తయారు కావలసి ఉంటుంది. పూజ్యులుగా ఉన్నప్పుడు ప్రాలబ్ధము అనుభవిస్తారు. ఎలాగైతే గొప్ప-గొప్ప రాజుల జీవిత చరిత్ర గాయనము చేయబడ్తుందో అలా సత్యయుగములో మొదటి నంబరు మహారాజ - మహారాణులు అనగా లక్ష్మీనారాయణుల మహిమ తప్పకుండా చేస్తారు. అయితే వారు అలా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణానికి బ్రహ్మ-సరస్వతులు ఇరువురికీ నేర్పించేవారు శివుడు. అయితే వీరి పేరు శాస్త్రాలలో అదృశ్యము చేసి, అగడం - బగడం(అర్థము లేని) వ్రాతలు వ్రాసేశారు. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలు నెంబరువారుగా తెలుసుకుంటారు. ఈ డ్రామా నడుస్తూ ఉంది. కల్పక్రితము కూడా మీరు ఇప్పుడు తయారవుతున్నట్లే అప్పుడు కూడా అలాగే తయారయ్యారు. ఈ వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది. ఫలాలు కూడా తప్పకుండా పక్వమౌతాయి. వృక్షము పెరిగేందుకు సమయము పడ్తుంది కదా. వృక్షము పెరిగి పెద్దదైనప్పుడు మీరు దేవీ దేవతలుగా తయారై పోతారు. మిగిలినవారందరు వినాశనమైపోతారు. పిల్లలైన మీరు ఇప్పుడు పరిపక్వమౌతూ ఉన్నారు. కొందరు పూర్తిగా పక్వమౌతారు. కొందరు తక్కువగా అవుతారు. కొందరికి తుఫానులు వస్తాయి. సంపాదనలో గ్రహచారము వచ్చి కూర్చుంటుంది. బాబా అంటున్నారు - యోగము చేస్తూ ఉండండి, దాని వలన మీ పాపాలన్ని దగ్ధమైపోతాయి. ఇది చాలా పెద్ద సంపాదన, అందుకే భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. అయితే దాని ద్వారా ఏమి లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ ఆత్మలో మురికి ఏర్పడి ఉంది. మీరే పూజ్యులుగా, మీరే పూజారి మనుష్యాత్మలుగా అవుతారు. కాని భగవంతునిగా అవ్వజాలరు. వారు కూడా పూజారులుగా అవుతే, వారిని పూజ్యులుగా ఎవరు చేయాలి! మనలను పూజ్యులుగా చేయువారు తండ్రి. మనము పూజ్య పావన దేవతలుగా ఉండేవారము. మళ్లీ క్రిందికి దిగుతూ దిగుతూ శూద్రులుగా అయిపోయాము. సత్యయుగ దేవీ దేవతలను ఈశ్వరుని నూతన రచన అని అంటారు. మనుష్యులను దేవతలుగా తయారు చేసిన వారి మహిమ వర్ణనాతీతము..... అని సిక్కులు పాడ్తారు. మంచిరీతిగా చదవండని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి, టీచరు, గురువుల కర్తవ్యము పురుషార్థము చేయించుట. పిల్లలూ! సమయాన్ని వృథా చేయకండి, అనవసరంగా పదవి భ్రష్టమైపోతుంది. తర్వాత చాలా పశ్చాత్తాపపడ్తారు అని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము మీ స్థితి ఇలాగే ఉంటుంది, తర్వాత ఏమీ చేయలేరు. సాక్షాత్కారమైపోతుంది, కల్ప-కల్పము ఇలాంటి దుర్గతినే పొందుకుంటానని పక్కా పక్కాగా నిశ్చయమైపోతుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే చాలా ఏడ్వవలసి వస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక తరగతి నుండి మరో తరగతికి మారునప్పుడు నెంబరువారుగా కూర్చుంటారు. మనము కూడా నూతన ప్రపంచములోకి(బదిలీ) ట్రాన్స్‌ఫర్‌ అవుతాము. బ్రాహ్మణుల మాల గాయనము చేయబడలేదు. రుద్రమాలయే పూజింపబడ్తుంది. అయితే ఈ మాల ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మాల పై భాగాన మేరు(జంట) పూస చూపిస్తారు. మేరు పూస విష్ణువు. దాని పైన ఉన్న పుష్పము శివబాబా. ఆ తర్వాత మిగిలిన మాల ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు రుద్రమాలలో కూర్చబడేందుకు పురుషార్థము చేస్తున్నారు. సింహాసనాధికారులుగా తయారయ్యేందుకు పురుషార్థము చేయండి. ఎవరికైనా దు:ఖము కలిగించే విషయాలు వదిలేయండి. మన తండ్రి దు:ఖహర్త-సుఖకర్త. ఒకవేళ పిల్లలైన మీరు కూడా దు:ఖమిస్తే, వీరు ఈశ్వరీయ పిల్లలని ఎవరనుకుంటారు? వికర్మలు చేయడం అనగా జీవ హత్య చేసుకోవడం. అసత్యమాడరాదు, పాపాలు చేయరాదు. ఓడిపోతే తండ్రిని క్షమించమని అంటారు. భక్తిలో కూడా ఏదైనా తప్పు జరిగితే పశ్చాత్తాపపడి ముక్కుచెంపలు వేసుకుని క్షమించమంటారు. ఇది జ్ఞానమార్గము. ఇందులో ఎవరి హృదయాన్నీ దు:ఖపెట్టరాదు. జ్ఞాన తుంపర్లు(బిందువులు) శీతలంగా చేస్తాయి. పిల్లలైన మీరు చదువుకునేందుకు ఇచ్చటకు వచ్చారు. చదువులో మ్యానర్లు(గుణగణాలు) చాలా మంచివిగా ఉంచుకోవాలి. ఇది కూడా చదువే చదివించేవారు నిరాకార తండ్రి. వారికి మీ ఆంతర్యములోని అన్ని విషయాలు తెలుసు. ఒక సెంటర్లో ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ధర్మరాజు కొరడాతో కొట్టారనే సమాచారము అందింది. కాని ఈ సంగతి ఈ బాబాకు తెలియనే తెలియదు. చాలామంది వికారాల వశమై సత్యమే తెలపరు. స్వయాన్ని రక్షించుకునేందుకు చేసిన తప్పును దాచి పెడ్తారు. కాని శివబాబా నుండి దాచిపెట్టలేరు. మిమ్ములను చదివించేవారు శివబాబాయే. వారిని కూడా మర్చిపోతారు. దీనిని తెలివి తక్కువతనమని, వారిని దురదృష్టవంతులని అంటారు. ఇచ్చట ఎవరి అసత్యము గాని, సత్యము గాని దాగి ఉండలేదు. ఈ బాబా అంటున్నారు - నేను అంతర్యామిని కాను, శివబాబా అంతర్యామి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను నిరాకారుడను. నాకు అన్నీ తెలుసు. ఇతడైతే సాకారములో ఉన్నాడు. నేను పునర్జన్మ రహితుడను. ఇతడు జనన-మరణాలలోకి వస్తాడు. అందుకే నీకు నీ జన్మల గురి౦చి తెలియదు. నేను వినిపిస్తున్నానని ఇతనితో అనడం జరుగుతుంది. సూర్యవంశములో వచ్చే వారందరికీ నేను వినిపిస్తున్నాను. చాలామంది పిల్లలు దాస్తూ ఉంటారు. బాబా ముందుకు రానే రారు. బాబా చెప్తున్నారు - ఏ విషయాలూ ఇతని నుండి దాచకండి. ఇతనికి అన్ని విషయాలు వినిపించండి. అప్పుడా తప్పులు క్షమించబడ్తాయి. ఇతడు నా కుమారుడే కదా. నాకైతే సర్వమూ తెలుసు. ఇతనికి ఎలా తెలియాలి? అందుకే ఇతనికి అన్నీ వినిపించండి. క్రిందటి జన్మ-జన్మాంతరాల లెక్కాచారమైతే నా వద్ద ఉంది. పోతే ఈ జన్మలో ఏ లెక్కాచారమైతే ఉందో దానిని ఇతనికి వినిపిస్తే, నేను కూడా వింటాను. అంతేకాని ఇంట్లో కూర్చుని శివబాబాకు అన్నీ తెలుసు అని భావించరాదు. అలా అనుకోకండి. ఆ విధంగా భక్తిమార్గములో చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ సన్ముఖములో వచ్చాను. నాకు తెలిపిస్తే, మీకు సలహా కూడా లభిస్తుంది. నేను మీకు గమనము కూడా ఇప్పిస్తాను. హెచ్చరిక చేస్తాను. ముఖము నల్లగా చేసుకోకండని(వికారాలలోకి వెళ్లకండి) తండ్రి అర్థం చేయిస్తారు. పోను పోను చివరి సమయము చాలా నాజూకుగా ఉంటుంది. శిక్షలు చాలా లభిస్తాయి. ఉదాహరణ కూడా మీరు చూస్తూ-వింటూ ఉంటారు. చేసిన పాపము ఎప్పుడూ సర్జన్‌ వద్ద దాచిపెట్టకండి. క్షమించేవారు శివబాబా. ఈ బాబా కాదు. ఈ సమయములో పాపము చేస్తే, వంద రెట్ల శిక్ష పడ్తుంది. అలాగే వ్యర్థముగా అసత్యము చెప్పకండి. బాబా పిల్లలందరికీ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇది ఎంతో అనంతమైన పాఠశాల.

గోవులైన మీరు (అన్నయ్యలు) గుప్త వేషములో చాలా పనులు చేయవచ్చు. మీరు అర్థం చేయిస్తే ఇది కూడా ఒక ప్రభుత్వమని వారి హృదయాలకు తప్పకుండా తగులుతుంది. ఈ జ్ఞానము గుప్తమైనది. బీజము, వృక్షము, సృష్టి చక్రములను గురించి అర్థం చేసుకోవాలి. ఇది నాలుగు యుగాల చక్రము. దీని బదులు ఆ ప్రభుత్వము చరకా(రాట్నము)ను ఉంచేశారు. మీది బ్రహ్మకుమారుల పాండవ సైన్యము. మన రాజ ముద్రికను తీసుకెళ్లాలి. చరకా తిప్పినంత మాత్రాన సత్యమేమైనా జయిస్తుందా? సత్యమేవ జయతే సంభవమవుతుందా ? నిజానికి ఇది సృష్టి చక్రానికి సంబంధించిన విషయము. మీరు భయపడరాదు. గుప్త వేషములో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు బహురూపి అయిన శివబాబా పిల్లలు. మీరు కూడా బహురూపులుగా ఉండాలి. కాని ఎంత చెప్పినా పిల్లల బుద్ధిలోకి ఎక్కదు. కొద్దిగా సేవ చేయగానే సంతోషపడిపోతారు. బుర్ర ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎక్కిపోతుంది. ఇప్పుడు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. రకరకాల పురుషార్థము చేయాలి. బాబా అనేక పాయింట్లు ఇస్తారు. ఈ జ్ఞాన యజ్ఞమైతే నడుస్తూనే ఉంటుంది. అన్ని మార్గాలలోని వారిని పిలుస్తూ ఉండండి. రాజులను కూడా పిలువవచ్చు. సమావేశాలు కూడా జరపవచ్చు. ఎటువంటి మనుష్యులుగా ఉంటారో, అటువంటి కార్డులు ముద్రించవలసి వస్తుంది. ''ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో వచ్చి తెలుసుకోండి. మీరు వస్తే మేము మీకు పరమపిత పరమాత్ముని కథను, 5 వేల సంవత్సరాల జీవాత్మల కథను వినిపిస్తాము. అద్భుతము కదా. '' మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పావనంగా తయారయ్యేందుకు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు మాయ కలిగించే విఘ్నాలను లెక్కచేయరాదు.
2. మానవులందరి పై జ్ఞాన తుంపర్లు చల్లి శీతలంగా తయారుచేసే సేవ చేయాలి. ఎవరి హృదయాన్నీ ఎప్పుడూ దు:ఖపెట్టరాదు. తండ్రి సమానము దు:ఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.
వరదానము:- ''నలువైపులా ఆందోళనకరంగా ఉన్న సమయంలో అవ్యక్త స్థితి లేక అశరీరిగా అయ్యే అభ్యాసము ద్వారా విజయీ భవ''
చివరి సమయంలో నలువైపులా వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా చాలా ఆందోళనకర శబ్ధాలు వినిపిస్తాయి. వాయుమండలం కదిలించేదిగా, బాధతో అరిచేదిగా ఉంటుంది. ఇటువంటి సమయంలో '' ఒక సెకండులో అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను'' - అనే అభ్యాసమే విజయులుగా చేస్తుంది. అందువలన యజమానిగా అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటి ద్వారా మాట్లడే, కావాలంటే చెవుల ద్వారా వినే, వద్దనుకుంటే ఒక సెకండులో స్టాప్‌ - ఈ అభ్యాసమే విజయ మాలలోకి తీసుకొస్తుంది.

స్లోగన్‌:- ''పురుషార్థాన్ని తీవ్రంగా చేయాలంటే నిర్లక్ష్యము అనే లూజ్‌ స్క్రూ ను టైట్‌ చేయండి''

No comments:

Post a Comment