Friday, 3 November 2017

Telugu Murli 18/10/2017

18-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీకు దివ్య దృష్టి లభించింది - ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుందని మీకు తెలుసు. అందువలన దీనినుంచి మమత్వము తొలగించాలి, పూర్తిగా బలి అవ్వాలి.
ప్రశ్న:- ఏ పిల్లలైతే అవినాశి తండ్రి పై పూర్తిగా సమర్పణ అయ్యారో వారి గుర్తులు ఏవి?
సమా:- వారు తమ ధనము మొదలైన వాటిని వ్యర్థంగా ఖర్చు పెట్టరు. భక్తిమార్గములో దీపావళి మొదలైన పండుగ రోజులలో ఎంతో బాణసంచా, టపాకాయలు మొదలైనవి కాలుస్తారు. అల్పకాలికమైన వేడుకలను, సంబరాలను ఖుషీగా జరుపుకుంటారు. ఇదంతా సమయాన్ని, ధనాన్ని, శక్తిని వృథా చేయడమేనని మీకు తెలుసు. ఇచ్చట మీరు ఇలాంటి వేడుకలు జరుపుకోరాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వానప్రస్థములో ఉన్నారు. మీరు ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ప్రపంచంలోకి వెళ్లాలి.
పాట:- మిమ్ములను పొంది మేము విశ్వమంతా పొందుకున్నాము......(తుమ్హే పాకే హమ్‌నే .........)

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థము చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని పొందుకున్నారు. మీరు 5 వికారాల పై విజయము పొందేందుకు అనగా మాయ పై విజయము పొంది జగత్‌జీతులుగా అయ్యేందుకు తండ్రి మీకు సహాయము చేస్తారు. జగత్తు అనగా మొత్తము ప్రపంచము. మనము ఈ జగత్తుకు అంతా యజమానులుగా అవుతామని పిల్లలకు తెలుసు. అయితే ఎప్పుడు అవుతారు? రావణ రాజ్యము సమాప్తమైనప్పుడు అధికారులుగా అవుతారు. ప్రతి సంవత్సరము రావణుని తగులబెడ్తూ ఉంటారు. సంగమ యుగములో తండ్రి వచ్చి ఆత్మ దీపాన్ని వెలిగించి సత్యయుగానికి యజమానులుగా చేస్తారు. దశరా తర్వాత దీపావళి పండుగనాడు మనుష్యులు చాలా మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు. తరచుగా లక్ష్మీనారాయణులు, రాధా-కృష్ణులు మరియు దేవీల మందిరాలకు వెళ్తారు కానీ ఆ దేవీల గురించి, లక్ష్మీనారాయణుల గురించి వారికి తెలియదు. దేవీలనగా శివశక్తులు, బ్రాహ్మణీలు. దేవీల చేతులలో అస్త్ర-శస్త్రాలను చూపిస్తారు. వాస్తవానికి దేవీల చేతులలో ఎలాంటి అస్త్రశస్త్రాలు లేనే లేవు. వారు గుప్తంగా ఉన్నారు. రావణుని పై విజయము పొందితే అర్ధకల్పము వరకు మీ వేడుకలు, సంతోషాలు స్థిరమైపోతాయి. ఇప్పుడు మీరు వేడుకలు జరుపుకోరు. ఇది నిజమైన దీపావళి కాదు. ఎందుకంటే ఈ రోజు దీపాలు వెలిగిస్తారు, రేపు ఆరిపోతాయి. దశరా పండుగను కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. బ్రాహ్మణులైన మీరు మీ గృహాలలో దీపాలు వెలిగించరు. మందిరాలు మొదలైన వాటిలో దీపాలు, కరెంటు లైట్లు మొదలైనవి వెలిగిస్తారు. దీపావళి అనగానేమో, దశరా అనగానేమో మనుష్యులకు తెలియదు. ఆ సమయములో మొత్తం భారత ఖండమంతా క్రొత్తదిగా అవుతుంది. దీపాలు మొదలైనవి వెలిగించడం భక్తిమార్గానికి చెందినవి. భక్తిమార్గములో ఎంతో ధనాన్ని వృథా చేస్తారు. ఆ రోజు ఎంతో బాణసంచాను, టపాకాయలను కాలుస్తారు. సమయాన్ని, డబ్బును, శక్తిని ఎంతో వ్యర్థము చేస్తారు. ఇది ముళ్ళ అడవి. అందరూ అడవి మనుష్యులుగా అయిపోయారు. మీరు కూడా మొదట అలాగే ఉండేవారు. ఏమీ అర్థము చేసుకునేవారు కాదు. సత్యయుగములో వ్యర్థంగా ఖర్చు చేయరు. ఇచ్చట వ్యర్థముగా చాలా ఖర్చు చేస్తారు. దాన-పుణ్యాలు చేసినా అల్పకాల ఫలము దొరుకుతుంది. మనము అవినాశి తండ్రి పై బలిహారమయ్యాము. కనుక మన సర్వస్వము అవినాశిగా అయిపోతుందని మీకు తెలుసు. పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకుంటారు. పిల్లలైన మీరు మోహజీత్‌ రాజు కథనైతే విన్నారు కదా. ఈ కథ సత్యయుగానికి చెందినది కాదు ఎందుకంటే అచ్చట అకాలమృత్యువు ఉండదు. ఆ సమయములో అందరూ నిర్మోహులుగా, మోహజీతులుగా ఉంటారని తెలిపేందుకు ఉదాహరణగా ఈ కథను తయారుచేశారు. శరీర సహితంగా పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించాలి ఎందుకంటే మీరు నూతన ప్రపంచములోకి వెళ్తున్నారు. పాత ప్రపంచము పై ఎవరికైనా మమకారము ఉంటుందా? దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. కేవలం దేహము పై మాత్రమే మమకారాన్ని తొలగించుకోమని బాబా చెప్పరు. కాని ఈ కళ్ళతో వేటినైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు సర్వమూ సమాప్తము కానున్నదనే దివ్యదృష్టి మీకు లభించింది. పాత ప్రపంచము వినాశమయ్యే ఉంది. క్రొత్త విశ్వము తయారౌతుంది. శివబాబా మనకు రాజ్యమునిస్తారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ(సదా) శివుడే. ఎందుకంటే వారికి తమ స్వంత శరీరము లేనే లేదు. బ్రహ్మ-విష్ణు-శంకరులకు కూడా వారి స్వంత శరీరాలు ఉన్నాయి. కాని వారు ఉపరి భాగములో (పైన) ఉంటారు. అమరనాథుడు అమరంగా చేసే కథను అమరలోకములోకి తీసుకెళ్లేందుకు వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయడంలో శ్రమ పడాల్సి ఉంటుంది కదా. ఇక్కడైతే అందరూ ముళ్ళగానే ఉన్నారు. ఒకరికొకరు ఎంతగా ముళ్ళను గుచ్చుకుంటారో చెప్ప శక్యము కాదు. అందువలన ఇప్పుడు మీరు ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరాదని తండ్రి చెప్తున్నారు. కామఖడ్గాన్ని ఉపయోగించరాదు. ఈ కామ హింస ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఎవరినైనా హతమారుస్తే ప్రాణములు మాత్రమే కోల్పోతారు. కాని ఇచ్చట(కామము వలన) జన్మ-జన్మాంతరములు దు:ఖితులుగా అవుతూ ఉంటారు. అందుకే తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు కామ ఖడ్గాన్ని ఉపయోగించరాదు.

ఇప్పుడు మీరు దశరా పండుగను జరుపుకుంటున్నారు. తర్వాత దీపావళి వస్తుంది. సత్యయుగములో లక్ష్మీ దేవి స్వయంగా రాజ్యపాలన చేస్తుంది. కావున అచ్చట వారిని కూర్చోబెట్టి పూజించే విషయమే ఉండదు. మందిరాలలో ఉండే మనుష్యులకు ఆ దేవతల జీవిత చరిత్ర్రలు తెలియదు. పిల్లలైన మీకు వారి జీవితచరిత్రలు తెలుసు. పిల్లలైన మీరు రూప్‌బసంత్‌లు(జ్ఞానయోగులు). తండ్రి చెప్తున్నారు - నేను కూడా శరీరాన్ని ధరించాను కాని నేను శరీరాన్ని ధారణ చేసే విధానము వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు దీపావళి పండుగ సంతోషమునివ్వదు. ఎందుకంటే మనము ఇప్పుడు వానప్రస్థములో ఉన్నాము. మనము పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తాము. బాబా అంటారు - '' 108 అతుకులున్న బట్టలు ధరిస్తే దేహాభిమానము తొలగిపోతుంది''. ఈ సమయములో మీరు ముళ్ళ అడవి నుండి పుష్పాల ప్రపంచములోకి వెళ్తున్నారు. బాగా చదువుకుంటే, వ్రాసుకుంటే నవాబులౌతారని అంటారు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను నరుని నుండి నారాయణునిగా చేస్తాను. దాని కొరకు ఉత్తమ పురుషార్థము చేయాలి. నేను చదివించేటప్పుడు పదవిని ఎందుకు పాడు చేసుకుంటారు? మాతా-పితలను ఎందుకు అనుసరించరు? ఎవరు బాగా చదువుకుంటారో వారు రాజవంశములోకి వస్తారని బాబా సాక్షాత్కారము చేయించారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మనము చదువుతున్నామని మీకు తెలుసు. మనుష్యులు మరణిస్తే స్వర్గవాసులుగా అవుతారని భావిస్తారు. అయితే స్వయంగా బాబాయే వచ్చి స్వర్గములోకి తీసుకెళ్తారని తర్వాత మళ్లీ రావణుడు నరకవాసులుగా చేస్తాడని మీకు తెలుసు. హిందూ, చీనీ భాయి-భాయి అని మనుష్యులు అంటారు. కాని మళ్లీ ఒకరికొకరు దు:ఖమునిచ్చుకుంటూ ఉంటారు. మాతా-పితల నుండి అపారమైన సుఖము లభిస్తూ ఉందని మీకు తెలుసు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని అంటారు. అందువలన ఇప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. కొంతమంది నరకవాసుల నుండి స్వర్గ వాసులుగా అవుతారు. కొంతమంది ఈ నరకము నుండి శాంతిధామ నివాసులుగా అవుతారు. కావున అందరికీ మేలే జరుగుతుంది. సత్యయుగములో దు:ఖమిచ్చే వస్తువేదీ ఉండదు. గొప్ప వ్యక్తుల వద్ద ఫర్నీచరు కూడా గొప్పగా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది. అచ్చట దు:ఖమిచ్చే జంతువులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ ఫర్నీచరు కూడా మొదటి రకము కావాలి, దానిని స్వర్గమని అంటారు. అల్లా అవలద్దీన్‌ నాటకముంది. దీపాన్ని రుద్దగానే రాజ్యము లభిస్తు౦ది కావున మన తండ్రి అయిన అల్లా(బాబా) అవలద్దీన్‌ అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందువలన తండ్రి ఒక సెకెండులో వైకుంఠానికి అధికారులుగా చేస్తారు. బాబా స్వర్గమును(అవల్దీన్‌ను) సాక్షాత్కారము చేయిస్తారు. అలాగని మేము కూడా సాక్షాత్కారములోకి వెళ్తామని పిల్లలు అనరాదు. బాబా అంటున్నారు - ధ్యానులకన్నా జ్ఞానులు నాకు ప్రియమైనవారు ఎందుకంటే ధ్యానము(సాక్షాత్కారము)లో మాయ ప్రవేశిస్తుంది. జ్ఞానములో మాయ రాదు. ఎవరైతే నౌధా భక్తి(తొమ్మిది రకాల), గాఢమైన భక్తి చేస్తారో వారికి బాబా సాక్షాత్కారము చేయిస్తారు. ఇక్కడ నౌధా భక్తి చేయడం జరగదు. చిన్న చిన్న పిల్లలకు సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారానికి అలవాటు పడితే చదువును చదవలేరు. ప్రారంభంలో ధ్యానం కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చేవారు. కానీ ఈ రోజు వారు లేనే లేరు. జ్ఞానయుక్త ఆత్మలకు ఏ విషయములోనూ సంశయము రాదు. సంశయము వచ్చి చదువును వదిలేశారంటే తండ్రిని వదిలినట్లే. ఇప్పుడు సూర్యవంశీ దేవీదేవతల రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇతర ధర్మ స్థాపకులు ఎవ్వరూ రాజధానిని స్థాపన చేయరు. ఆ ధర్మము వృద్ధి చెందినప్పుడు వారి రాజ్యము నడుస్తుంది. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. ఎవరైనా క్రొత్తవారు వస్తే పరమపిత పరమాత్మతో మీకు ఏమి సంబంధము? అని అడగండి. అప్పుడు వారు పరమాత్మ మాకు తండ్రి అని చెెప్తారు. బాబా స్వర్గ స్థాపన చేస్తారు, రావణుడు దానిని నరకంగా చేస్తాడు. స్వర్గాన్ని తయారు చేసిన వారిని పూజిస్తారు, నరకాన్ని తయారు చేసిన వారిని తగులబెడ్తారు. ఎందుకంటే నరకములో మనుష్యులు కామచితి పై కాలిపోతారు. అందువలన కోపముతో రావణుని తగులబెడ్త్తారు. కాని రావణుడు తగులబడడు. పరంపర నుండి ఈ ఆచారము వస్తూ ఉందని వారంటారు. కాని పరంపరకు అర్థము వారికి తెలియదు. శత్రువు దిష్టిబొమ్మను తగులబెడ్త్తారు. రావణుని ఎందుకు కాలుస్తారు? ఎందుకంటే రావణుడు మిమ్ములను కాలుస్తాడు. మీరు రావణుని కాలుస్తారు. అయితే మనుష్యులకు ఈ విషయాలేవీ తెలియవు. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. అందువలన అచ్చట రావణుని తగులబెట్టరు. దానిని నిర్వికార ప్రపంచమని అంటారు. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నాము. శాపమిచ్చేవాడు రావణుడు. రావణుడని ఎవరినంటారు? స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. సత్యయుగములో ఈ వికారాలు ఉండవు. సన్యాసులైతే తర్వాత వస్తారు. ఇప్పుడు దేవతా ధర్మము లేనే లేదు. అది మళ్లీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. 108 మాల తయారవుతూ ఉంది. అందువలన ప్రజలు కూడా కావాలి కదా. జయపూర్‌కు రాజు ఒక్కడే కాని ప్రజలు ఎంతమంది ఉండేవారు! ఇప్పుడు మాల తయారౌతూ ఉంది. ప్రజలు కూడా కావాలి. ఎవరైతే ఇక్కడ పిల్లలుగా తయారై మళ్లీ మధ్యలో వెళ్లిపోతారో వారు సాధారణ ప్రజలలోకి వెళ్లిపోతారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ జీవన్ముక్తి కావాలని అంటారు. జీవన్ముక్తి ఒక్కరికి మాత్రమే లభించదు కదా! పూర్తి రాజ్య వంశమంతా కావాలి. అష్టావక్ర గీతలో క్షణములో జీవన్ముక్తి లభించిందని వ్రాశారు. కాని ఎలా లభించింది? ఇది ఎవ్వరికీ తెలియదు. ఆది సనాతన దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిస్తుంది. రాజ్యపదవి లభిస్తూ ఉంటే మనము శ్రీమతమును ఎందుకు అనుసరించరు? కమలపుష్ప సమానంగా ఎందుకు అవ్వరాదు? మీరు బ్రాహ్మణులు కదా. అందువలన శంఖు, చక్రము, గద మరియు పద్మము మీ వద్ద ఉన్నాయి.

మనుష్యులు కేవలం దీపావళి పండుగనాడు మాత్రమే నూతన వస్త్రాలు ధరిస్తారు, మందిరాలకు వెళ్తారు. కృష్ణ జన్మాష్టమినాడు నూతన వస్త్రాలు ధరించరు. దీపావళి నాడు క్రొత్త వస్త్రాలు ధరిస్తారు. ఆ రోజు అన్నీ క్రొత్తవే. ఆ రోజున వ్యాపారస్థులు తమ పాత ఖాతాలను సమాప్తము చేసి నూతన ఖాతాలను ప్రారంభిస్తారు. మీరు కూడా ఇప్పుడు పాత ఖాతా సమాప్తము చేసుకొని కొత్తది ప్రారంభము చేస్తున్నారు. తండ్రి లాభము చేకూరుస్తారు, రావణుడు నష్టపరుస్తాడు. లాభము ఎలా కలుగుతుంది? మన్మనాభవ, మధ్యాజీభవ ద్వారా కలుగుతుంది. విష్ణువు మధ్యలో ఉన్నాడు కదా. మధ్యాజీభవ అనగా తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తాడు. అందువలన పాత ప్రపంచము వినాశనమైపోతుంది. శివబాబా కలియుగ అంత్యములో వస్తారు. తర్వాత మళ్లీ సత్యయుగము ప్రారంభమౌతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని వ్రాయబడి కూడా ఉంది. బ్రహ్మ ప్రజాపిత కదా. కావున మీరు ఎవరి పిల్లలు? శివుని పిల్లలా లేక బ్రహ్మ పిల్లలా? మీరే మాతా-పితా, బంధు, సఖా అని కూడా అంటారు. నిజానికి ప్రాక్టికల్‌గా వారు ఇప్పుడు మాతా-పితగా ఇక్కడ ఉన్నారు. చదువు చదువుకొని మళ్లీ వారసత్వము పొందుతున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి మిమ్ములను దు:ఖితులుగా చేస్తాడు. దు:ఖము కూడా మెల్ల మెల్లగా పెరుగుతుంది. ఈ కలియుగము విషయ సాగరము, సత్యయుగము క్షీరసాగరము. విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు. ప్రపంచములోని వారికి దశరా, దీపావళి గురించి తెలియదని మీకు తెలుసు. ఇప్పుడు వాటి రహస్యాన్ని కూడా మనము తెలుసుకున్నాము. నిన్న మనము స్వర్గములో ఉండేవారమని ఇప్పుడు నరకములో ఉన్నామని మీకు తెలుసు. మళ్లీ రేపు స్వర్గములో ఉంటాము. రేపు అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఎవరైనా వస్తే ఈ ఆశ్రమము ఎవరిదో తెలుసా? ప్రజాపిత బ్రహ్మ పేరు విన్నారా? అని అడగండి. ఇంతమంది బి.కెలు ఉన్నారు కావున బ్రహ్మ వీరందరికీ తండ్రి అయ్యారు కదా. తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది. తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేస్తే 'మధ్యాజీభవ' గా అవుతారు. బాబా వ్యాపారము చేయరాదని చెప్పరు. తండ్రి చెప్తున్నారు - భలే వ్యాపారము చేయండి కాని తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే వారి నుండి వారసత్వము లభిస్తుంది. వారసత్వము లభిస్తుందనే ఆశ(ప్రలోభము) ఉంది కదా. ఇతర స్థానాలలో ఈ ఆశ ఉండదు. పాఠశాలలో కూడా ఆశ ఉంటుంది. అందుకే విద్యార్థి జీవితము ఉత్తమోత్తమ జీవితమని అంటారు. ఇది అనంతమైన చదువు. అనంతమైన చరిత్ర-భూగోళాల గురించి మీకు తెలుసు. పాఠశాలలకు వెళ్లి అనంతమైన చరిత్ర-భూగోళము అంటే ఏమిటో తెలపండి. మీరు హద్దు చరిత్ర-భూగోళము చదివిస్తారు, మేము మీకు లక్ష్మీనారాయణుల అనంతమైన చరిత్ర- భూగోళాలు తెలియజేస్తాము. అంతేకాక లక్ష్మీనారాయణులు ఆ పదవి ఎలా పొందుకున్నారో కూడా తెలుపుతామని చెప్పండి. పోను పోను మీకు కాలేజీల నుండి కూడా ఆహ్వానము లభిస్తుంది. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. వారు స్పిరిచ్యువల్‌(ఆధ్యాత్మిక) ఫాదర్‌, అందువలన వారు ఆత్మలకు ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. నిరాకారులైన వారు సాకారములోకి వచ్చి వినిపిస్తారు. ఇందులో కృష్ణుని మాటే లేదు. ఏ విషయాన్నీ వారు అర్థము చేసుకోరు. వారి బుద్ధి రూపీ దారము చాలా చిక్కుబడి ఉంది. స్వతంత్రము కావాలని అంటూ ఉంటారు కానీ జగడాలు పెరుగుతూనే ఉంటాయి. స్వతంత్రము కావాలని అంటారు. రావణుని నుండి సత్య-సత్యమైన స్వతంత్రము మీకు లభిస్తుంది. మనము క్రైస్తవుల నుండి స్వతంత్రము పొందుతున్నామని భారతవాసులు భావిస్తారు. కాని స్వతంత్రము ఎక్కడ ఉంది? స్వతంత్రము, స్వతంత్ర రాజధాని మీకు మాత్రమే లభిస్తుంది. మీరు లభిస్తే భూమి, ఆకాశము, సముద్రము అన్నీ మాయమైపోతాయి అని పాటలో విన్నారు కదా. అందులో హద్దులేవీ ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాతా - పితలను పూర్తిగా అనుసరించి చదువు ద్వారా ఉన్నత పదవి పొందాలి. ఈ ప్రపంచము పై ఎలాంటి ఆసక్తిని ఉంచుకోరాదు, వనవాసములో ఉండాలి.
2. ఈ కనులకు ఏవైతే కనిపిస్తున్నాయో, వాటిని చూస్తూ కూడా చూడరాదు. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. సంగమ యుగములో ఏదీ వ్యర్థము చేయరాదు.

వరదానము:- ''బాప్‌దాదా స్నేహానికి బదులు సమానంగా అయ్యే తపస్వీ మూర్త్‌ భవ''
సమయము యొక్క పరిస్థితుల అనుసారము స్వ ఉన్నతి కొరకు తీవ్ర వేగముతో సేవ చేసేందుకు లేక బాప్‌దాదా స్నేహానికి బదులు(రిటర్న్‌) ఇచ్చేందుకు వర్తమాన సమయంలో తపస్సు చేయడం చాలా అవసరము. పిల్లలకు తండ్రి పై ప్రేమ ఉంది. కాని బాప్‌దాదా ప్రేమకు బదులు, స్వరూపములో పిల్లలను తన సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. సమానంగా అయ్యేందుకు తపస్వీ మూర్తులుగా అవ్వండి. అందుకు నలువైపులా ఉన్న తీరాలను వదిలి అనంతమైన వైరాగులుగా అవ్వండి. తీరాలను ఆధారంగా చేసుకోకండి.

స్లోగన్‌:- ''శీతలంగా అయ్యి ఇతరులను శీతలమైన దృష్టితో తృప్తి పరచే శీతల యోగులుగా అవ్వండి''

No comments:

Post a Comment